డ్రగ్స్ చట్టం కేసులో నిందితుల వాంగ్మూలం సాక్ష్యం కాదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme court drug cases : రోజు రోజుకీ డ్రగ్స్ మాఫియా పెరిగిపోతోంది. డ్రగ్స్ వినియోగం..అక్రమ రవాణాపై పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన అడ్డుకట్ట పడటంలేదు. డ్రగ్స్ కు బానిసగా మారుతున్న యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది ఆయా కుటుంబాలకే కాదు దేశాభివృద్ధిపై కూడా ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా కేసులో దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో లాగా డ్రగ్స్ అక్రమంగా తరిలించే సమయంలో పట్టుబడిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
డ్రగ్స్, అక్రమ రవాణా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోలేమనీ..వారినే నిందితులుగా పరిగణించలేమని..దీంతో నిందుతులను శిక్షించేందుకు ఆధారాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు గురువారం (అక్టోబర్ 29,2020) స్పష్టం చేసింది. ఇలా చేస్తే అది వ్యక్తి జీవించే హక్కు, సమానత్వ హక్కు, నేరం చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చే రక్షణను హరించినట్టు అవుతుందని పేర్కొంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ చట్టం కింద విచారణ జరుపుతున్న అధికారికి నేరం అంగీకరిస్తూ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం సాక్ష్యం కాబోదని తెలిపింది.
ఓ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజార్టీతో తీర్పును చెప్పింది. ధర్మాసనంలోని జస్టిస్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా ఈ అభిప్రాయంతో ఏకీభవించగా..జస్టిస్ ఇందిరా బెనర్జీ మాత్రం విభేదించారు. ఈ కేసులో జస్టిస్ నారిమన్ 163 పేజీల తీర్పుతో కూడిన నోట్ రాసారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో అంటే 2013లో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేస్తూ ఈ తీర్పునిచ్చారు.
ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం ఇటువంటి కేసులను దర్యాప్తు చేసే వారిని పోలీస్ అధికారులుగానే పరిగణిస్తారు. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం.. పోలీసు అధికారి ముందు నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్నే సాక్ష్యంగా పరిగణించరాదు. వేధింపులకు గురిచేసి నేరం చేసినట్టు నిందితులతో బలవంతంగా చెప్పించకుండా నిరోధించడానికే ఇలాంటి నిబంధన ఉంది.
ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం విచారణ సందర్భంగా నిందితుడు చెప్పే వివరాలను నేర అంగీకార ప్రకటనగా భావించరాదు. ఈ సెక్షన్ ప్రకారం కేవలం సమాచారం రాబట్టే అధికారం మాత్రమే విచారణ అధికారికి ఉంది. పోటా, టాడా వంటి కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల ప్రకారం.. చేపట్టిన భద్రతా చర్యలను ధర్మాసనం ప్రస్తావించింది.
ప్రభుత్వ అధికారాలు, పౌరుల ప్రాథమిక హక్కుల మధ్య సున్నితమైన సమతౌల్యత అవసరమని పేర్కొంది. అటువంటి హక్కుల నేపథ్యంలో ఎన్డీపీఎస్ చట్టం నిర్దేశించాల్సి ఉందని తెలిపింది. అందువల్ల ఈ చట్టంలో అనేక భద్రతలు ఉన్నాయి, ఇది చాలా తీవ్రమైన మరియు క్రూరమైన స్వభావం’ అని ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఇదే విధమైన వివిధ నిబంధనలను విశ్లేషిస్తూ.. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 ఒక విభాగం మాత్రమేనని ఇది విచారణలో నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించడానికి అనుమతిస్తుంది.