ఎవరీ స్వప్న సురేష్, దేశ విదేశాల్లో మార్మోగుతున్న పేరు, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు, సీఎం మెడకు ఉచ్చు

కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్ ను విధుల నుంచి తొలగించారు. గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్ పాత్రపై ఆరోపణలు బయటపడిన మరుసటి రోజే శివశంకర్పై ప్రభుత్వం వేటు వేసింది.
ఎయిర్ పోర్టులో రూ.15 కోట్ల విలువైన 30కిలోల గోల్డ్ సీజ్:
ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30కిలోల బంగారం ఎయిర్ పోర్టులో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళ ఐటీ ఉద్యోగిని స్వప్న సురేష్ ను సోమవారం(జూలై 6,2020) కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు స్వప్నను ప్రశ్నిస్తున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని అయిన స్వప్న సురేష్ పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆమెను ఐటీ శాఖ నుంచి తొలగించారు.
ఎవరీ స్వప్న సురేష్:
కేరళలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సెన్షేషనల్ గా మారింది. ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు స్వప్న సురేష్. అసలు ఎవరీ స్వప్న సురేష్. గోల్డ్ స్మగ్లింగ్ లో ఆమె పాత్ర ఏంటి? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్. ప్రస్తుతం దేశ, విదేశాల్లో స్వప్న సురేష్ పేరు మార్మోగిపోతోంది. యూఏఈ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన స్నప్న తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని కేరళకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తోంది. డిప్లమాటిక్ వీసాలను అడ్డం పెట్టుకుని ఆమె సాగిస్తున్న వ్యవహారం ఎట్టకేలకు బట్టబయలైంది. అయితే, ఆమె సీఎంవోలో కీలక ఉద్యోగి కూడా కావడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రికి తెలిసే ఈ తతంగం సాగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్వప్న సురేష్ కు సహకరించి ఉంటారనే అనుమానాల నేపథ్యంలో సీఎంవోకు చెందిన టాప్ ఐఏఎస్ అధికారిపై వేటు పడటం తాజా మలుపు.
పుట్టింది, పెరిగింది అబుదాబిలో:
స్వప్న సురేష్ అబుదాబిలో పుట్టింది. అక్కడే పెరిగింది. స్వప్న తండ్రి స్వస్థలం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని బలరామపురం. స్వప్న తిరువనంతపురంలో రెండేళ్లు పని చేసింది. ఆ తర్వాత 2013లో ఎయిరిండియా సాట్స్ లో జాబ్ వచ్చింది. 2016లో ఆమె అబుదాబీ తిరిగి వెళ్లిపోయింది. ఎయిరిండియా ఉన్నత ఉద్యోగి సంతకం ఫోర్జరీ కేసుకి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో ఆమె వెళ్లిపోయింది. దర్యాఫ్తులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వప్న సురేష్ ను జూన్ లో విచారణకు పిలిచారు. కానీ ఆమె రాలేదు. స్వప్న సురేష్ ను ఇబ్బంది పెట్టొద్దని కేసు విచారణ చేస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
స్వప్న లైఫ్లో టర్నింగ్ పాయింట్ యూఏఈ కాన్సులేట్ జాబ్:
స్వప్న సురేష్ యూఏఈ కాన్సులేట్ లో సెక్రటరీగా పని చేసింది. 2019లో ఆ జాబ్ వదిలేసింది. బాధ్యతారాహిత్యంగా ఉన్న కారణంగా ఆమెను విధుల నుంచి తప్పించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కాగా, యూఏఈ కాన్సులేట్ లో జాబ్ చేయడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అరబిక్, ఇతర భాషల్లో స్వప్నకు మంచి పట్టు ఉంది. అబుదాబీ నుంచి కేరళకు వచ్చే నాయకులకు ఆమె సాయంగా ఉండేది. కేరళ ఐటీ సెక్రటరీ శివశంకర్ తరుచుగా స్వప్న సురేష్ ప్లాట్ కి వచ్చేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.
అసలేం జరిగిందంటే:
కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం(జూలై 6,2020) ఒకేసారి 30 కేజీల బంగారం పట్టుపడింది. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. పట్టుపడిన బంగారం విలువ రూ.15 ఉంటుందని అధికారులు తెలిపారు. తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను.. చివరికి నిజం కక్కేయడంతో సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. కేరళ ప్రభుత్వం ఎన్నారై శాఖ ద్వారా వివిధ దేశాలతో నేరుగా దౌత్య సంబంధాలు నెరుపుతుండటం తెలిసిందే.
అలా దొరికిపోయిన స్వప్న:
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సరిత్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కస్టమ్స్, పోలీస్ అధికారులు స్వప్న కోసం గాలింపు ప్రారంభించారు. గతంలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసిన సమయంలోనే స్వప్న పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కేరళ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక ఐటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు(KSITIL)కు మార్కెటింగ్ అధికారిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన స్వప్నను ఆ ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుక ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ప్రోద్బలం ఉందని తెలుస్తోంది. సీఎం విజయన్ కు తెలిసే ఆమె నియామకం జరిగిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంతో రాజకీయ దుమారం:
స్వప్న సురేష్ పని చేస్తున్న ఐటీ శాఖకు సీఎం పినరయి విజయన్ నే నిర్వహిస్తుండటం, గతంలో ఆమె సీఎంతో దిగిన ఫొటోలు వైరల్ కావడం, తన స్మగ్లింగ్ కలాపాలకు ఆమె సీఎంవో కాంటాక్టులను కూడా వాడుకున్నట్లు బయటపడటంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం కార్యాలయానికి నేరుగా సంబంధాలున్నాయని, స్వప్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం సీఎం తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో సీఎం విజయన్ మీడియా ముందుకు రాకతప్పలేదు. ‘‘స్వప్న సురేష్ నియామకం ఎలా జరిగిందో నాకు తెలియదు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు అర్థం లేదు. స్మగ్లింగ్ కేసుకు సంబంధించి నేరస్తులను విడిచిపెట్టబోము. కస్టమ్స్ అధికారులు బాగా పని చేశారు” అని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాగా, యూఏఈలో ఎవరి ద్వారా స్వప్న బంగారం పొందారు? స్మగ్లింగ్ ద్వారా తీసుకొచ్చిన గోల్డ్ ను ఎవరికి అమ్మాలనుకున్నారు? అసలు స్వప్న వెనుక ఉన్నది ఎవరు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడంపై కస్టమ్స్, పోలీసులు ఫోకస్ పెట్టారు.
Read Here>>భువనేశ్వర్ టెక్ మహింద్రా ఉద్యోగులకు కరోనా..కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు