రూ.150కోట్లతో : అమరావతిలో ఆనందనిలయం

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 01:38 PM IST
రూ.150కోట్లతో :  అమరావతిలో ఆనందనిలయం

Updated On : January 30, 2019 / 1:38 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జనవరి 31 గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల స్థాయిలో ఆలయ నిర్మాణం చేయాలని చంద్రబాబు టిటిడి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇష్టదైవం అయిన తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని అమరావతిలో నిర్మించే భాధ్యతను టిటిడికి చంద్రబాబు అప్పగించారు.

గుంటూరు జిల్లా వెంకటపాలె వద్ద ఇందుకోసం కేటాయించిన 25 ఎకరాలలో రేపు ఉదయం సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. ఐదు ఎకరాల్లో ఆలయాన్నినిర్మిస్తారు. మిగిలిన 20 ఎకరాల్లో కళ్యాణమండపాలు, ఆలయ నిర్వహణకు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లకు తగిన నిర్మాణాలు, పార్కులు నిర్మించనున్నారు. ఆలయం కోసం తిరుమల ఆలయాన్ని తలపించే విధంగా డిజైన్ రూపొందించారు. సుమారు 150 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖ‌ుస్థాపన చేసిన అనంతరం ఫిబ్రవరి1నుంచి 10వ తేదీ వరకు ఆలయ ప్రదేశంలో టీటీడీ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 1వ తేదినుండి ఆలయశంఖుస్ధాపన చేసిన ప్రదేశంలో వసంతోత్సవం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు నిర్వ‌హించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన చతుర్వేద పారాయణం, వసంతోత్సవం, ఫిబ్రవరి 2న చతుర్వేద పారాయణం, స్నపన తిరుమంజనము, ఫిబ్రవరి 3న బుగ్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 4న యజుర్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 5న సామవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 6న అధర్వణవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 7న ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 9న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 10న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, మీనలగ్నమందు ప్రధమ శిలేష్టకాన్యాసము, పూర్ణాహుతి, వేదాశీర్వాద కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేవాదాయశాఖ అధికారులు, టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమాన్ని శ్రాస్తోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాత్రిపూట జరిగే కార్యక్రమాలను విజయవంత చేసేందుకు ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రిళ్లు దీపాల వెలుగుతో ఆ ప్రాంతం అంతా కళకళలాడుతోంది. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గోనుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తరహాలో ఆలయం నిర్మిస్తుండంటంతో అమరావతి మరో తిరుమలగా రూపుదిద్దుకోనుంది. అమరావతి అన్ని హంగులతోపాటు ఆధ్యాత్మిక నగరంగా కూడా కానుంది.