ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ : సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోంది?
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోంది…? పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు లైన్ క్లియర్ అయినట్లేనా…? ఉభయసభలు ప్రోరోగ్ కావడంపై ప్రతిపక్షం ఏమంటోంది…? ఎలా ముందుకెళ్లాలని భావిస్తోంది…?
3 రాజధానుల అంశం జాప్యం కాకుండా వైసీపీ వ్యూహం
అనుకున్న పనికి ఎన్ని అడ్డంకులొచ్చినా… వాటిని తొలగించుకుని మరీ ముందుకెళ్లాలని చూస్తోంది వైఎస్ జగన్ సర్కార్. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, సిఆర్డీఎ చట్టాన్ని రద్దు చేసే అంశంపై వివాదం నెలకొన్నా… ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు బిల్లులనూ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అయితే అక్కడ అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలే సరికి శాసన మండలినే రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దీనిపై అన్నింటా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశాన్ని జాప్యం చేయకుండా ఉభయ సభలనూ ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయడం వైసిపి వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
కౌన్సిల్ లో ప్రభుత్వానికి చుక్కెదురు
డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు కొంత బ్రేక్ తర్వాత జనవరి 20వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు కొనసాగాయి. జనవరిలో జరిగిన సెషన్లోనే జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, అసెంబ్లీలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా.. కౌన్సిల్కు వచ్చే సరికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీకి వున్న ఆధిపత్యాన్ని కౌన్సిల్ వ్యూహాత్మకంగా వాడుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును కౌన్సిల్ తిప్పి పంపడంతో.. అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులు పొడిగించి మరీ.. కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
ప్రభుత్వానికి వెసులుబాటు
తాజాగా అసెంబ్లీ, మండలి ప్రోరోగ్ చేయడంలో ప్రభుత్వం రెండు అంశాలలో వెసులుబాటును కల్పించుకున్నట్లు అయ్యింది. కౌన్సిల్ తిరస్కరించిన రాజధానుల బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చి.. దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపుపై ముందడుగు వేసే వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో ప్రోరోగ్ చేయకుండా వుంటే.. త్వరలో జరిగే బడ్జెట్ సెషన్లో గతంలో గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శాసనమండలిని కూడా సమావేశపరచాల్సి వచ్చేంది.
వికేంద్రీకరణ, ఆర్డినెన్స్ బిల్లులపై ఫిబ్రవరి 25న హైకోర్టులో విచారణ
తాజాగా ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కోసం విడుదల చేసే నోటిఫికేషన్లో కేవలం శాసనసభను మాత్రమే నోటిఫై చేసే అవకాశం వుంది. తద్వారా మండలి మనుగడలో లేదని చాటినట్లవుతుంది. మరోవైపు వికేంద్రీకరణ, ఆర్డినెన్స్ బిల్లులపై ఈనెల 25న హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టులో ఉన్న అంశంపై ఆర్డినెన్స్ సరికాదంటూ ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. బడ్జెట్ సెషన్స్లో బిల్లులు మళ్లీ సభకు రావాల్సిందేనంటోంది టీడీపీ.