జగన్ ప్రభుత్వం మరో విజయం : వెలిగొండ రివర్స్ టెండరింగ్ లో రూ.87 కోట్లు ఆదా

  • Published By: chvmurthy ,Published On : October 19, 2019 / 02:34 PM IST
జగన్ ప్రభుత్వం మరో విజయం : వెలిగొండ రివర్స్ టెండరింగ్ లో రూ.87 కోట్లు ఆదా

Updated On : October 19, 2019 / 2:34 PM IST

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో  రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం ఆదా చేసింది. 

ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్‌ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్‌ సంస్థ 4.69 శాతం అధిక ధరకు పనులు దక్కించుకున్నట్లు గుర్తించింది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్‌ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ఖజానాకు రూ.782.8 కోట్లు ఆదా అయ్యాయి.