ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ టెన్షన్.. మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు

మూడో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ టెన్షన్.. మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు

YCP Third List To Release

Updated On : January 8, 2024 / 5:51 PM IST

YCP Third List : వైసీపీ మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ ను కలిసేందుకు క్కాంప్ ఆఫీసుకు వెళ్లారు. ఇక చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. రేపటిలోగా మూడో జాబితాను ఫైనల్ చేయనున్నారు జగన్.

ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా పార్టీలో భారీ మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జులను మార్చేస్తున్నారు జగన్. ఇంఛార్జుల మార్పునకు సంబంధించి ఇప్పటికే రెండు జాబితాలు విడుదలయ్యాయి. ఇక, వైసీపీకి సంబంధించి ఇంఛార్జిల మార్పుల కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే రెండు లిస్టులు ప్రకటించిన వైసీపీ.. ఇక మూడో జాబితాకు సంబంధించిన కసరత్తులో సీఎం జగన్ బిజీగా ఉన్నారు.

Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు. మూడో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. శుక్రవారం ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు. ఎంపీలు కూడా కలిశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు రావాలంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. దాంతో ఎమ్మెల్యేలంతా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, డోన్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్యాంప్ ఆఫీసుకి వచ్చారు.

ఎక్కడైతే మార్పులు చేర్పులు ఉంటాయో, ఎక్కడైతే పూర్తిగా టికెట్ లేకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తున్నారో వారందరినీ కూడా క్యాంప్ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలు మాట్లాడతారు. ఆ తర్వాత సీఎం జగన్ నేరుగా వారితో మాట్లాడతారు. ఎందుకు స్థాన చలనం చేయాల్సి వచ్చింది, టికెట్ నిరాకరించడానికి గల కారణాలను సీఎం జగన్ వారికి వివరిస్తారు. మళ్లీ ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో వారికి మంచి పదవులు ఉంటాయని చెబుతున్నారు.

ఇక, ఒంగోలుకు సంబంధించిన పంచాయితీ క్లియర్ కానుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి చేరుకున్నారు. విజయసాయిరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఒంగోలుకు సంబంధించిన టికెట్ల పంచాయితీ కొన్ని రోజులగా జరుగుతోంది. ఒంగోలు ఎంపీ, ఒంగోలు సిటీ అసెంబ్లీ, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా ఒంగోలు సిటీ టికెట్ తనకే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. దాంతో పాటు ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకు, ఇక తన వర్గానికి చెందిన వారికే గిద్దలూరు టికెట్ ఇవ్వాలని బాలినేని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

దీంతో ఒంగోలుకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్ ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నారు. చాలా కాలంగా ఒంగోలు జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య వర్గపోరు ఉంది. ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ రోజు ఒంగోలులో సీట్ల మార్పులకు సంబంధించి పూర్తి క్లారిటీ రానుందని సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరు? ఒంగోలు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? బాలినేని, వైవీ సుబ్బారెడ్డి డిమాండ్స్ ఎంత మేరకు తీరనున్నాయి? అనేదానిపై క్లారిటీ రానుంది.