రివర్స్ టెండరింగ్ లో మరో రూ.13.7 కోట్లు ఆదా

రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్యాకేజి లో రూ. 130.42 కోట్ల అంచనా వ్యయంతో 2176 యూనిట్ల నిర్మాణం కోసం మంగళవారం జనవరి7న రివర్స్ టెండర్లను ఆహ్వానించారు.
టెండర్ల ప్రక్రియలో శ్రద్ధ సబూరి ప్రాజెక్ట్ ఇండియా సంస్థ రూ. 116.72 కోట్లకు బిడ్ ను దాఖలు చేసి ఎల్ 1 గా నిల్చింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో పట్టణ గృహ నిర్మాణ పనుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 8 ప్రాజెక్టులకు సంబంధించి 48,608 యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి రూ.303.24 కోట్ల భారాన్ని తగ్గించామన్నారు.
తాజాగా మంగళవారం నిర్వహించిన వాటితో కలిపి రూ. 2529.43 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో 50,784 యూనిట్ల నిర్మాణాల కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.2212.49 కోట్ల వ్యయంతో టెండర్లు ఖరారు అయ్యాయని మంత్రి తెలిపారు. ఇంతవరకు పట్టణ గృహ నిర్మాణ పనుల్లో రూ. మొత్తం 316.94 కోట్లను ఆదా చేశామని మంత్రి పేర్కొన్నారు.