Tamilnadu Politics: బీజేపీతో తెగతెంపులకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన అన్నాడీఎంకే
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు పైగా పార్టీ సీనియర్ నేతలు అన్నామలై వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు
![Tamilnadu Politics: బీజేపీతో తెగతెంపులకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన అన్నాడీఎంకే Tamilnadu Politics: బీజేపీతో తెగతెంపులకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన అన్నాడీఎంకే](https://10tv.in/wp-content/uploads/2023/06/Untitled-1-104.jpg)
AIADMK vs BJP: భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమని అన్నాడీఎంకే పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధినేత అన్నామలై చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరు పార్టీల మధ్య వార్ పెరిగిపోయింది. తమ మద్దతుతో నాలుగు స్థానాలు గెలిచిన బీజేపీ.. తమపైనే దాడి చేస్తుండడంపై అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలోనే బీజేపీకి దూరం జరిగేందుకు వెనుకాడబోమంటూ పళనిస్వామి ప్రకటించారు.
Tamilnadu Politics: ‘మేడం జయలలిత అంటే చాలా గౌరవం’.. అన్నాడీఎంకే దెబ్బతో స్వరం మార్చిన బీజేపీ చీఫ్
అన్నామలై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి జయ హయాంలో అవినీతి అధికమైందని, అవినీతి కేసులోనే ఆమె అరెస్టయ్యారని అన్నారు. దీంతో అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నామలైపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జరిగిన అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలోనే అన్నామలైపై పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగించకూడదని పట్టుబట్టారు. చివరకు అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన జిల్లా కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు పైగా పార్టీ సీనియర్ నేతలు అన్నామలై వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత మెజారిటీ జిల్లా కార్యదర్శులు, సభ్యుల ప్రతిపాదన మేరకు అన్నామలైకి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.