Kadiyam Srihari : కాంగ్రెస్లో కడియం శ్రీహరి చేరికపై సస్పెన్స్.. సీఎం రేవంత్ రెండుసార్లు టైమ్ ఇచ్చినా..
కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Suspense Over Kadiyam Srihari Joining in Congress
Kadiyam Srihari : కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయమే కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరిగినా.. ఇప్పటివరకు చేరలేదు. సీఎం రేవంత్ రెడ్డి రెండుసార్లు కడియంకు సమయం ఇచ్చారు. అయినప్పటికీ కడియం వెళ్లకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఉదయం 11.30, 2.30 గంటలకు సీఎం రేవంత్ సమయం ఇచ్చారు. కానీ, ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ లో చేరాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. కడియం వెళ్లకపోవడంతో ఆయన చేరిక ఉందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కూడా ఇవాళ (మార్చి 30) కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ కి చెందిన ముఖ్య నేతలు అంతా కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై ముఖ్యమైన నేతలతో కడియం శ్రీహరి చర్చించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా సీఎం రేవంత్ నివాసానికి వెళ్లాలని కడియం శ్రీహరి ఒక ప్లాన్ చేసుకున్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్యతో పాటు గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి కాంగ్రెస్ లో చేరికకు ఉదయం 11.30గంటలకు సమయం ఇచ్చారు సీఎం రేవంత్.
అయితే, కడియం శ్రీహరి, కడియం కావ్య రాలేదు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మాత్రమే 11.30గంటలకు సీఎం ఇచ్చిన సమయంలో కాంగ్రెస్ లో చేరారు. మరోసారి కడియం శ్రీహరి, కడియం కావ్యలకు సమయం ఇచ్చారు సీఎం రేవంత్. అయితే, 2.30 గంటలకు కూడా వారు రాలేదు. దీంతో సాయంత్రం చేరిక ఉంటుందని సమాచారం ఇచ్చారు. కానీ, అదీ జరగలేదు. దీంతో ఇవాళ (మార్చి 30) కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చేరిక లేనట్లే.
Also Read : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?