తిరంగా ర్యాలీ : సీపీ క్యారెక్టర్ లెస్ ఫెలో : ఉత్తమ్
సీపీ అంజనీ కుమార్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఒక దిగజారిన వ్యక్తి..అవినీతిపరుడు అన్నారు. సీపీగా ఉండే అర్హత ఆయనకు లేదని చెప్పారు. అంజనీకుమార్ ఆర్ఎస్ఎస్ తొత్తుగా అభివర్ణించారు ఉత్తమ్. దగ్గరుండి ఆర్ఎస్ఎస్ సబకు ఏర్పాట్లు చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
గాంధీభవన్లో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే..పోలీసులకు ఏం పని అంటూ ప్రశ్నించారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు చర్యలు తీసుకొనే అధికారం ఉందన్నారు. దీనిపై 2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అసలు ఉత్తమ్ కుమార్కు ఎందుకు కోపం వచ్చింది. గాంధీభవన్ వద్ద డిసెంబర్ 28వ తేదీ శనివారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి నిరాకరించడంపై నేతలు మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతినిచ్చిన పోలీసులు..తమ ర్యాలీకి ఎందుకు ఫర్మిషన్ ఇవ్వరని ప్రశ్నించారు ఉత్తమ్.
దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతోందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అనుమతినివ్వకపోడం ఖండిస్తున్నామన్నారు. సీపీ అంజనీ కుమార్పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.
Read More : గ్రాండ్ వెల్ కం : సీఎం జగన్ కోసం మానవహారం