టార్గెట్ చినబాబు, మండలిలో టీడీపీని పెద్ద దెబ్బకొట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్

చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్నా, భవిష్యత్తులో అయినా వైసీపీ బలం పెరుగుతుంది. కానీ, ఈలోపు టీడీపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలంటే, లోకేష్ బాబుపై వేటు వేయాలనే స్కెచ్ గీసింది అధికార పార్టీ.
చినబాబుపై అనర్హత వేటే లక్ష్యంగా పావులు:
ఏపీలో మండలి రాజకీయం మళ్లీ మొదలు కాబోతోంది. ఇప్పటికే మండలి వేదికగా అనేక రాజకీయ వ్యూహాలు చూసిన ఏపీ ప్రజలకి… త్వరలో మరింత మజా చూపించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి టీడీపీతో పాటు లోకేశ్ని టార్గెట్ చెయ్యబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన అధికారపక్షం… చినబాబుపై అనర్హత వేటే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
టీడీపీని మరింత వీక్ చేసేందుకు కొత్త వ్యూహాలు:
ఏపీలో ఇటీవల మండలి కేంద్రంగా రాజకీయాలు రణరంగంగా మారాయి. వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ అడ్డుకోవడంతో మొదలైన మండలి మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ప్రభుత్వం… దాని సంగతి తేలే లోపు మరింతగా టీడీపీని బలహీనపర్చాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీల్ని తమవైపు తిప్పుకుంది. డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, శమంతకమణి, శివనాథ్రెడ్డి… అధికార పార్టీకి జై కొట్టారు. వీరిలో డొక్కా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేసింది వైసీపీ. అయితే టీడీపీని మరింత వీక్ చేసేందుకు కొత్త వ్యూహాల్ని తెరపైకి తెస్తోంది. ఇందుకోసం లోకేశ్ని టార్గెట్ చేస్తోంది.
దాని ఆధారంగా లోకేష్ పై వేటు:
మండలిలో లోకేశ్ను టార్గెట్ చెయ్యాలంటే బలమైన కారణం ఉండాలి. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల్లో జరిగిన గొడవని తమకు అనుకూలంగా మల్చుకోవాలని చూస్తుంది వైసీపీ. మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీలకు గొడవ జరిగినప్పుడు… సభలో లోకేశ్ ఫోన్లో ఫొటోలు తీయడాన్ని అవకాశంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన వైసీపీ… ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చి లోకేశ్పై అనర్హత వేటు వేసేలా పావులు కదుపుతోంది. చిన్నబాబుపై చర్యలు తీసుకుంటే టీడీపీని బలంగా దెబ్బకొట్టినట్లేనని అంచనా వేస్తోంది.
మండలి రద్దు తీర్మానంతో టీడీపీ ఎమ్మెల్సీల్లో చాలా మంది లోలోపల మదనపడ్డారు. పార్టీ ఎలాగూ అధికారంలో లేదు కాబట్టి… ఎమ్మెల్సీ పదవి అయినా ఉండాలని కోరుకుంటున్న వారు ఎక్కువే ఉన్నారు. అయితే లోకేశ్పై కనుక వేటు పడితే… మరికొందరు వైసీపీ వైపు వచ్చే అవకాశాలున్నాయి.