Appalayagunta : అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

appalayagunta
Appalayagunta : తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం గం.8 నుండి గం.10.30ల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

10 వతేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు…
10-06-2022(శుక్రవారం) ఉదయం ధ్వజారోహణం – రాత్రి పెద్దశేష వాహనం
11-06-2022(శనివారం) ఉదయం చిన్నశేష వాహనం – రాత్రి హంస వాహనం
12-06-2022(ఆదివారం) ఉదయం సింహ వాహనం – రాత్రి ముత్యపుపందిరి వాహనం
13-06-2022(సోమవారం) ఉదయం కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం – రాత్రి సర్వభూపాల వాహనం
14-06-2022(మంగళవారం) ఉదయం మోహినీ అవతారం – రాత్రి గరుడ వాహనం
15-06-2022(బుధవారం) ఉదయం హనుమంత వాహనం – రాత్రి గజ వాహనం
16-06-2022(గురువారం) ఉదయం సూర్యప్రభ వాహనం – రాత్రి చంద్రప్రభ వాహనం
17-06-2022(శుక్రవారం) ఉదయం రథోత్సవం – రాత్రి అశ్వవాహనం
18-06-2022(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.