Sabarimala Temple : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనాలపై అధికారుల కీలక నిర్ణయం..
పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

Sabarimala Temple : శబరి గిరులు శరణుఘోషతో మార్మోగిపోతున్నాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు అయ్యప్ప దర్శనానికి పోటెత్తారు. ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా లక్షలాది మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
శబరిమల ప్రాంతం మొత్తం అయ్యప్ప స్వాములు, భక్తులతో నిండిపోయింది. పంబ వరకు అయ్యప్ప స్వాములు క్యూలైన్ లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. రద్దీ కారణంగా అయ్యప్ప స్వామి దర్శనాలపై ట్రావెన్ కోర్ దేవస్థానం నియంత్రణ విధించింది.
దర్శనాలను సౌకర్యవంతం చేయడానికి సోమవారం నుంచి ఆన్ లైన్ దర్శనాలకు పరిమితి విధించబోతున్నారు. 13వ తేదీన 50వేల మందికి, 14వ తేదీన 40వేల మందికి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 15వ తేదీకి 60వేల మందికి ఆన్ లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు.
Also Read : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఈ జనవరిలో రూ.25వేల లోపు బెస్ట్ ఫోన్లు మీకోసం..!