Team India : బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమ్ఇండియా హోం సీజన్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు..
భారత జట్టు హోం సీజన్ షెడ్యూల్లో పలు మార్పులు చేసుకున్నాయి.

BCCI Announces Updated Venues For Team India Home Season
భారత జట్టు హోం సీజన్ షెడ్యూల్లో పలు మార్పులు చేసుకున్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో భారత పురుషుల సీనియర్ జట్టు ఆడబోయే టెస్టు మ్యాచ్లకు సంబంధించిన వేదికలలో స్వల్ప మార్పులు జరిగాయి. అదే విధంగా భారత మహిళల సీనియర్ జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్కు సంబంధించిన వేదికలు, సౌతాఫ్రికా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో ఆడబోయే వన్డే మ్యాచ్ల కు సంబంధించి వేదికలు మారాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టెస్ట్ల వేదికల మార్పు..
ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా సీనియర్ పురుషుల జట్టు భారతదేశంలో పర్యటిస్తుంది. దీనికి ముందు భారత జట్టు వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను ఆడనుంది. ఈ సిరీస్లో అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండవ టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి మార్చారు. అదే విధంగా దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టెస్ట్ను ఢిల్లీ నుండి కోల్కతాకు మార్చారు. ఈ మ్యాచ్ నవంబర్ 14 నుంచి 18 వరకు జరగనుంది. నవంబర్ నెలలో ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది.
🚨 NEWS 🚨
BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA
— BCCI (@BCCI) June 9, 2025
చిదంబరం స్టేడియంలో ఔట్ ఫీల్డ్, పిచ్కు మరమ్మత్తులు..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. అయితే.. ప్రస్తుతం చిదంబరం స్టేడియంలో ఔట్ పీల్డ్, పిచ్కు సంబంధించి మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ వేదికను మార్చారు. తొలి రెండు వన్డేలను న్యూ ఛండీఘడ్లోని పీసీఏ స్టేడియంలో, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో మార్పు..
దక్షిణాఫ్రికా A జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడాల్సి ఉంది. టెస్టు మ్యాచ్లు బెంగళూరు వేదికగానే జరగనుండగా.. వన్డే సిరీస్( నవంబర్ 13, 16, 19 )ను మాత్రం రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు.