యూవీ కోటి రూపాయలకు దొరకటం ఐపీఎల్ చరిత్రలో పెద్ద దొంగతనం
డాషింగ్ బ్యాట్స్ మెన్ గా భారత్ కు ఎన్నోవిజయాలు అందించిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ 12 వేలంలో ఆఖరి నిమిషం వరకు అమ్ముడు పోకుండా ఉన్నాడు. జైపూర్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్ లోఫ్రాంచైజీలు ఎవరూ యూవీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. రెండో రౌండ్ లో ముంబై ఇండియన్స్ బేసిక్ ధర ఇచ్చి యువరాజ్ సింగ్ ను జట్టులోకి తీసుకుంది. గత 11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది అతి పెద్ద దొంగతనమని యూవీని జట్టులోకి తీసుకోవడంపై ఆజట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ముంబై జట్టు యూవీతో పాటు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ను కూడా రూ.2 కోట్లకు దక్కించుకుంది. “యూవీ, మలింగ కోసం మేము ఎక్కువ బడ్జెట్ కేటాయించామని, యువీలాంటి ఆటగాడు కోటి రూపాయలకే మాకు దక్కడం బహుశా ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం. అతడు గెలవాల్సిన టోఫ్రీలన్నీ గెలిచాడు. అనుభనవజ్ఞులైన ఆటగాళ్లతోపాటు కుర్రాళ్ళ పై కూడా మేము దృష్టి పెట్టాం” అని ఆకాశ్ అంబానీ అన్నారు.
ఒకప్పుడు యూవీ కోసం ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పోటీపడేవారు. 2015 లో రూ.16 కోట్లు పలికిన యూవీ ధర క్రమేపీ తగ్గుతూ వస్తోంది. గత మూడు సీజన్లలోనూ యూవీ అంచనాల్ని అందుకోలేక పోవటంతో…… గత ఏడాది రూ.2 కోట్లకి కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ మళ్లీ వేలంలో అతడ్ని తీసుకోటానికి ఆసక్తి చూపించలేదు. దీంతో.. తన ధరని యువీ రూ. కోటికి తగ్గించుకున్నా ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు. వేరే ఫ్రాంఛైజీల నుంచి పోటీ లేకపోవడంతో చివరకు ముంబై జట్టు యూవీని కొటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్-12 వేలం యువరాజ్ అభిమానుల్ని చివరి వరకూ ఉత్కంఠకు గురిచేసింది. నమ్మకంతో తనను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్కు యువీ న్యాయం చేస్తాడో లేదో చూడాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.