Gautam Gambhir : సంజూ శాంసన్ వద్దే వద్దు.. రిషబ్ పంత్ ముద్దు.. : గౌతమ్ గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
![Gautam Gambhir : సంజూ శాంసన్ వద్దే వద్దు.. రిషబ్ పంత్ ముద్దు.. : గౌతమ్ గంభీర్ Gautam Gambhir : సంజూ శాంసన్ వద్దే వద్దు.. రిషబ్ పంత్ ముద్దు.. : గౌతమ్ గంభీర్](https://10tv.in/wp-content/uploads/2024/05/Gambhir-backs-Pant-as-India-first-choice-wicketkeeper-at-World-Cup.jpg)
Gambhir backs Pant as India first choice wicketkeeper at World Cup
Rishabh Pant – Sanju Samson : ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఈ పొట్టి ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొనుండగా ఒక్క పాకిస్తాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల క్రికట్ బోర్డులు తమ జట్ల వివరాలను వెల్లడించాయి. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా ఈ ప్రపంచకప్లో బరిలోకి దిగనుంది.
15 మంది సభ్యులు గల బృందంలో ఇద్దరు వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ శాంసన్లకు స్థానం దక్కింది. కాగా.. వీరిలో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారు ? అన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. తానైతే సంజూ శాంసన్కు బదులుగా రిషబ్ పంత్కు మొదటి ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. ఇందుకు రెండు కారణాలను వెల్లడించాడు.
IPL 2024 playoffs : ఏ జట్టుకు ఎంత శాతం అవకాశమంటే? ఎస్ఆర్హెచ్ 87.3%, సీఎస్కే 72.7%, ఆర్సీబీ..
ఐపీఎల్లో పంత్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడని, అదే సంజూ శాంసన్ టాప్ఆర్డర్లో బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. ఇక పంత్ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో అతడిని జట్టులోకి తీసుకుంటే కాంబినేషన్ చక్కగా ఉంటుందన్నాడు. ఇప్పటికే భారత టాప్ ఆర్డర్ సెట్ అయిందని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు టాప్ ఆర్డర్లో ఉన్నారని, దీంతో సంజూకు అక్కడ అవకాశం లేదన్నాడు.
ఇక సంజూ శాంసన్ను తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలన్నాడు. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపించాలని, ఫినిషింగ్ పాత్రను శాంసన్ చక్కగా పోషిస్తాడని చెప్పాడు.
భారత కాలమానం ప్రకారం జూన్ 2న టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న జరగనుంది.