PBKS vs CSK : చెన్నై పై విజయం.. గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు బీసీసీఐ షాక్..
చెన్నైపై విజయం సాధించిన ఆనందంలో ఉన్న పంజాబ్కు బీసీసీఐ షాకిచ్చింది.

Courtesy BCCI
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్రేట్ +0.289గా ఉంది.
బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) శతక్కొట్టగా, శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే (69; 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (36; 23 బంతుల్లో 6ఫోర్లు),శివమ్ దూబె (42; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (27; 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ మాక్స్వెల్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
మాక్స్వెల్కు జరిమానా..
ఈ సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ లేమీతో సతమతమవుతున్నాడు. మూడు మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. బౌలింగ్లో రాణిస్తున్నాడు.
కాగా..చెన్నైతో మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను మాక్స్వెల్కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను చేర్చారు. అతడు ఏ నేరానికి పాల్పడ్డాడు అనే విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించనప్పటికి.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు అని పేర్కొన్నారు.
ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 మాక్సీ తన తప్పును అంగీకరించినట్లు తెలిపారు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు, అద్దాలు, కిటికీలు, ఇతర ఫిక్చర్లు, ఫిట్టింగ్లకు నష్టం కలిగించే చర్యలు ఈ నిబంధనలోకి వస్తాయి.