LSG vs RCB : ఆర్సీబీ పై ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్కు బీసీసీఐ బిగ్ షాక్..
ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో లక్నో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్ను లక్నో ఏడో స్థానంతో ముగించింది. అసలే ఓటమి బాధలో ఉన్న లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అతడికి భారీ జరిమానా విధించింది.
ఈ మ్యాచ్లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో227 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా, భువనేశ్వర్, షపర్డ్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్కు తోడు విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే రెండు వికెట్లు తీయగా, ఆకాష్ మహారాజ్ సింగ్, ఆవేశ్ ఖాన్లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. ఈ సీజన్లో లక్నో జట్టు ఇలా ఇది చేయడం ఇది మూడోసారి. పదే పదే స్లో ఓవర్ రేటును నమోదు చేయడంతో లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ.30లక్షల ఫైన్ వేశారు ఐపీఎల్ నిర్వాహకులు. అంతేకాదండోయ్ ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోకి ఆటగాళ్ల ఒక్కొక్కరికి రూ.12లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏదీ తక్కువ అయితే జరిమానాగా విధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. టీ20 మ్యాచ్ల్లో 40 ఓవర్లు మంచి క్రికెట్ ఆడాలని అన్నాడు. 20 ఓవర్లు ఆడితే సరిపోదన్నాడు. తాము చేసిన పొరపాటు అదేనని చెప్పాడు. ఇక టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నుంచి జట్టును గాయాలు వేదిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఆ ప్రభావం జట్టు పై పడిందన్నాడు. ఇక తాను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలిపాడు. క్రికెట్ సంబంధించిన ఏ విషయం గురించి ఆలోచించనన్నాడు. త్వరలోనే ఇంగ్లాండ్తో సిరీస్ మొదలు కానుందని, ఆ సిరీస్ కోసం ప్రెష్ మైండ్తో ఉండాలని అనుకుంటున్నట్లుగా పంత్ తెలిపాడు.