Delhi Capitals : ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్.. హ్యాండ్ ఇచ్చిన స్టార్ ఆటగాడు..
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది.

Courtesy BCCI
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్క్ ఇప్పుడు భారత్కు రానని చెప్పాడు. ఇందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంగీకరించింది. స్టార్క్ దూరం కావడం ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఈసీజన్లో 11 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 14 వికెట్లు తీసి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతడు దూరం కావడంతో డీసీ బౌలింగ్ విభాగం బలహీన పడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.
కాగా.. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే స్టార్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్కు తాత్కాలిక రీప్లేస్మెంట్గా ఎంపిక చేసుకుంది. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ కూడా అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. అతడికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఆరు మ్యాచ్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 13 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్రన్రేట్ +0.362గా ఉంది. లీగ్ దశలో ఢిసీ మరో మూడు మ్యాచ్లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినా ప్లేఆఫ్స్లో అడుగుపెడుతుంది.