MS Dhoni Birthday Celebrations : మనుషులకు దూరంగా ధోని బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) శుక్రవారం(జూలై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకున్నాడు.
MS Dhoni Birthday : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) శుక్రవారం(జూలై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి మహేంద్రుడికి పెద్దగా ఇష్టం ఉండదు. అందుకనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉండడు.
అయితే.. తన 42 పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకున్నాడు. మనుషులకు దూరంగా ఈ వేడుక జరుపుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన మూగ జీవాల మధ్యలో కేట్ కట్ చేశాడు. అనంతరం ఆ కేక్ను వాటికి తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. “మీ అందరి హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా కృతజ్ఞతలు. నా పుట్టినరోజున నేను ఏమి చేశానో చూడండి ” అని ఆ వీడియో కింద రాసుకువచ్చాడు.
ఆ వీడియో తన ఫామ్ హౌస్లో తీసినట్లుగా తెలుస్తోంది. చిన్న టేబుల్పై ఉంచిన కేక్ను కట్ చేసిన ధోని.. ఆ ముక్కలను గాల్లోకి విసరగా.. కుక్కలు వాటిని ఎగిరి అందుకున్నాయి. అనంతరం ధోని కూడా ఓ కేక్ ముక్కను తినడం ఆ వీడియోలో చూడవచ్చు. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ వీడియోలో కనిపించలేదు.
View this post on Instagram
WI vs IND : భారత్తో తొలి టెస్టు.. విండీస్ భారీ కాయుడు వచ్చేశాడు
జంతువులంటే అమితమైన ప్రేమ..
మహేంద్ర సింగ్ ధోనికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. అతడి ఫామ్ హౌస్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. కుక్కలకు జారా, సామ్, లిల్లీ, గబ్బర్, జోయా అనే పేర్లను పెట్టుకున్నాడు. చేతక్ అనే గుర్రం సైతం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన ధోని ఫామ్హౌస్లో పాడి ఆవులు, అరుదైన కోళ్ల జాతులను సైతం పెంచుతున్నాడు.
Sourav Ganguly : టీ20ల్లో రోహిత్ శర్మ, కోహ్లిల కెరీర్ ముగిసినట్లేనా..? గంగూలీ చెప్పింది ఇదే..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో మహేంద్రుడి సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు అందుకున్న జాబితాలో రోహిత్ శర్మ సరసన ధోని చేరాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. రానున్న ఎనిమిది నెలల కాలంలో తన శరీరం స్పందించే దానిని బట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించాడు.