Sourav Ganguly : టీ20ల్లో రోహిత్ శర్మ, కోహ్లిల కెరీర్ ముగిసినట్లేనా..? గంగూలీ చెప్పింది ఇదే..
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లేదు.
Sourav Ganguly comments On Kohli and Rohit : భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లేదు. తాజాగా వెస్టిండీస్తో టీ20 సిరీస్కు కూడా వీరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో హార్దిక్ పాండ్య (Hardik Pandya) సారథ్యంలోనే టీమ్ఇండియా ఆడుతూ వస్తోంది. దీంతో ఈ సీనియర్ల టీ20 కెరీర్ ఇక ముగిసినట్లేనని, మళ్లీ టీమ్ఇండియా తరుపున పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడే అవకాశం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) కోసం కుర్రాళ్లను తీర్చిదిద్దే పనిలో ప్రస్తుతం బీసీసీఐ ఉందని, అందుకనే సీనియర్లను పక్కన బెట్టారని తెలుస్తోంది. అయితే.. ఎందుకు పక్కన బెడుతున్నారు అనే విషయం పై అటు బీసీసీఐ గానీ ఇటు సెలక్టర్లు గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా ఈ విషయంపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లిని, రోహిత్ శర్మను టీ20 జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో తనకి అర్థం కావడం లేదన్నారు. అత్యుత్తమంగా ఆడే ఆటగాళ్లు ఎవరినైనా సరే జట్టులోకి తీసుకోవాలన్నాడు. తన అంచనా ప్రకారం విరాట్, రోహిత్లలో మరికొంతకాలం టీ20 క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లి అద్భుత ఫామ్ను కొనసాగించగా.. అటు రోహిత్ కూడా మెరుగ్గా రాణించడాన్ని మనం చూశామన్నాడు. కాబట్టి వీరిని టీ20 జట్టులోకి తీసుకోవాలి. సీనియర్లు ఉండడం వల్ల యువకులకు మరింత ప్రయోజనం ఉంటుందని గంగూలీ చెప్పాడు.
ఇక ఐపీఎల్లో సత్తా చాటిన రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేశ్ శర్మలు కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయినా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు ఛాన్స్ వచ్చింది. అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అంత వరకు ఆడుతూనే ఉండాలి. తప్పకుండా వారికి సమయం వస్తుందని గంగూలీ అన్నాడు. 15 మందితో కూడిన జట్టునే ప్రకటించాల్సి ఉంటుందని, అందులో 11 మందికే తుది జట్టులో అవకాశం వస్తుందన్నాడు. అయితే.. మిగిలిన వారికి కూడా అవకాశం వస్తుందని తాను ఖచ్చితంగా చెప్పగలను అని గంగూలీ అన్నారు.