Rahul Dravid : ఇదే కదా ద్రవిడ్ అంటే.. క్రికెటర్లతో పాటు సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకుంటే..
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
![Rahul Dravid : ఇదే కదా ద్రవిడ్ అంటే.. క్రికెటర్లతో పాటు సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకుంటే.. Rahul Dravid : ఇదే కదా ద్రవిడ్ అంటే.. క్రికెటర్లతో పాటు సిబ్బంది అందరూ విశ్రాంతి తీసుకుంటే..](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-8-7.jpg)
No holiday for Rahul Dravid
No holiday for Rahul Dravid : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపును మిగిలిన మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్కు సిద్ధం అవుతోంది. టీమ్ఇండియా గురువారం పూణే వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆదివారం సాయంత్రమే భారత జట్టు పూణే చేరుకుంది.
బంగ్లాదేశ్తో మ్యాచుకు నాలుగు రోజులు సమయం ఉండడం.. వరుస మ్యాచులు, ప్రయాణాలతో భారత క్రికెట్లు అలసిపోతున్నారు అని భావించిన బీసీసీఐ వారికి సోమవారం విశ్రాంతి ఇచ్చింది. మంగళవారం సాయంత్రం నుంచి క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో భారత క్రికెటర్లు హోటల్ గదులకే పరిమితం అయ్యారు. అయితే.. కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం తీసుకోలేదు. సెలవు రోజు కూడా తన బాధ్యతలను నిర్వర్తించాడు.
పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లో చేసినట్లుగా ద్రవిడ్ పూణెలోని మైదానానికి వెళ్లాడు. వన్డే ప్రపంచకప్లో పూణెలో జరగనున్న మొదటి మ్యాచ్ ఇదే కావడంతో గ్రౌండ్ మొత్తం పరిశీలించాడు. అక్కడి క్యూరేటర్లు, మైదాన సిబ్బందితో కాసేపు ముచ్చటించాడు. పిచ్ స్వభావం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
పరుగుల వరద ఖాయం..!
పూణె మైదానం గత చరిత్ర చూస్తే అక్కడ పరుగుల వరద పారడం ఖాయం. వన్డేల్లో ఈ వేదికపై 14 ఇన్నింగ్స్లలో 8 సార్లు బ్యాటింగ్ చేసిన జట్టు 300 పరుగుల మార్కును దాటింది. ఇక్కడ జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్, భారత జట్లు తలపడ్డాయి. రెండు జట్లు కూడా 300 పైగా పరుగులు సాధించాయి. అయితే.. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది.
Also Read : నీకు ఎలా ఆడాలో మీ నాన్న నేర్పించలేదా..? మార్ష్ను ప్రశ్నించిన గవాస్కర్..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ లు ఈ వేదికపై చెలరేగుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ 11 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు.
భారత్ ఇలా.. బంగ్లా అలా..
వన్డే ప్రపంచకప్లో భారత్, బంగ్లాదేశ్లు భిన్నమైన ఆరంభాలను అందుకున్నాయి. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్లతో తలపడిన టీమ్ఇండియా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు బంగ్లాదేశ్ మాత్రం విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆరంభ మ్యాచులో అఫ్గానిస్థాన్ పై విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఆ తరువాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయింది.
ఇదిలా ఉంటే.. భారత్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ను మరో సమస్య వెంటాడుతోంది. కివీస్తో మ్యాచులో ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో అతడు భారత్తో మ్యాచ్కు కోలుకుంటాడా లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది.