శ్రేయస్ అయ్యర్ నా చెంప పగలగొట్టి ఉండాల్సింది..: మౌనాన్ని వీడి అసలు విషయాన్ని చెప్పిన బ్యాటర్ శశాంక్
తన తండ్రి సైతం తనపై సీరియస్ అయ్యారని తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025లో ముంబై ఇండియన్స్తో క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరిగిన తర్వాత తమ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనను తిట్టడంపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ మౌనాన్ని వీడాడు. తాను తప్పు చేశానని, అసలు శ్రేయస్ అయ్యర్ తన చెంపచెళ్లుమనిపించాల్సిందని శశాంక్ సింగ్ వ్యాఖ్యానించాడు.
క్వాలిఫయర్ -1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన పంజాబ్ జట్టు క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్పై గెలిచిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్-2 మ్యాచ్లో అతి ముఖ్యమైన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శశాంక్ సింగ్ రనౌట్ అయ్యాడు.
దీంతో అతడిపై శ్రేయస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిశాక శశాంక్ షేక్హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో శ్రేయస్ అయ్యర్ అతడిని తిట్టాడు. అప్పట్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Also Read: కేఎల్ రాహుల్ చిన్నప్పటి నుంచి ఇంతే..: కోచ్ శామ్యూల్ జయరాజ్
దీనిపై ఇన్ని రోజులు సైలెంగ్ ఉన్న శశాంక్ సింగ్ ఇవాళ స్పందిస్తూ… టీ20ల్లో శ్రేయస్ను మించిన సారథి లేడని చెప్పాడు. శ్రేయస్ జట్టులో అందరు ప్లేయర్లకు స్వేచ్ఛ ఇస్తాడని, అందరినీ సమానంగా చూస్తాడని అన్నాడు. అతడు యాటిట్యూడ్ చూపించడని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా యంగ్ ప్లేయర్లతో ఫన్నీగా ఉంటాడని చెప్పాడు.
మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనూ మంచి సలహా ఇస్తే స్వీకరిస్తాడని శశాంక్ తెలిపాడు. క్వాలిఫయర్ -2 మ్యాచ్లో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించానని, అసలు తనను శ్రేయస్ చెంపదెబ్బ కొట్టాల్సిందని చెప్పాడు. తన తండ్రి సైతం తనపై సీరియస్ అయ్యారని తెలిపాడు. మ్యాచులో కీలక సమయంలో తాను బీచ్లో నడిచినట్లు వెళ్లానని అన్నాడు. ఇలా చేస్తానని తాను అనుకోలేదని శ్రేయస్ తనతో అన్నాడని తెలిపాడు. అయితే, అనంతరం శ్రేయస్ తనను డిన్నర్కు తీసుకెళ్లాడని వివరించాడు.