Asia Cup 2025: టీమిండియా టీ20 వైఎస్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌? ప్రస్తుతం గిల్‌ దేనిపై దృష్టి పెట్టాడంటే..?

ఆసియా కప్‌ 2025 టీ20 ఫార్మాట్‌లో యూఏఈలో జరుగుతుంది. పాకిస్థాన్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌ ఏలో ఉంది. ఆసియా కప్‌ 2025 జట్టును భారత్ ఇంకా ప్రకటించలేదు.

Asia Cup 2025: టీమిండియా టీ20 వైఎస్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌? ప్రస్తుతం గిల్‌ దేనిపై దృష్టి పెట్టాడంటే..?

Shubman Gill

Updated On : August 10, 2025 / 6:00 PM IST

టీమిండియా టెస్ట్‌ ఫార్మాట్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ ఆసియా కప్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 2-2తో సిరీస్‌ను సమం చేయడంలో జట్టును సమర్థంగా నడిపించాడు శుభ్‌మన్‌ గిల్‌.

ఆసియా కప్‌ 2025 టీ20 ఫార్మాట్‌లో యూఏఈలో జరుగుతుంది. పాకిస్థాన్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌ ఏలో ఉంది. ఆసియా కప్‌ 2025 జట్టును భారత్ ఇంకా ప్రకటించలేదు. అయితే, భారత టెస్ట్‌ కెప్టెన్‌ గిల్‌ ఈ జట్టులో ఉంటాడని సమాచారం.

రెవ్‌స్పోర్ట్‌జ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుభ్‌మన్‌ గిల్‌ టీ20లకు వైఎస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. టీ20లకు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉంటున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా సూర్యకుమార్‌ యాదవ్‌ సిరీస్‌లో పాల్గొనడం సందేహంగా ఉన్నా, ఆసియా కప్‌ ముందు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు నెట్స్‌లో సాధన ప్రారంభించాడు.

ప్రస్తుతం గిల్‌ దేశీయ క్రికెట్‌పై దృష్టి పెడుతున్నాడు. ఈ నెల చివర ప్రారంభమయ్యే దులీప్‌ ట్రోఫీకి నార్త్‌ జోన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశీయ టోర్నమెంట్ల తర్వాత ఆసియా కప్‌ 2025 భారత జట్టులో చేరే అవకాశం ఉంది.

అసలు గిల్‌ ఆసియా కప్‌లో ఆడతాడా?
ఆసియా కప్‌ 2025లో శుభ్‌మన్‌ గిల్‌ను జట్టులో చేర్చాలా? లేదా? అనే విషయంపై భారత క్రికెట్‌ జట్టు సెలెక్టర్లు ఇంకా ఏ విషయాన్నీ తేల్చుకోలేదు. 8 దేశాల ఈ టోర్నమెంట్‌ సెప్టెంబర్‌ 9న ప్రారంభమై సెప్టెంబర్‌ 28న ముగుస్తుంది. అనంతరం అక్టోబర్‌ 2న వెస్టిండీస్‌తో 2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్‌ ఎంపికపై సెలెక్టర్లు సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది.

వెస్టిండీస్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆసియా కప్‌ ముగిసిన వారం రోజుల్లోనే ఉండటంతో గిల్‌ను జట్టులోకి తీసుకోవద్దని సెలెక్టర్లు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే 2026లో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు గిల్‌ అనుభవం అవసరమని కూడా భావిస్తున్నారు.