Sanju Samson : పదేళ్లలో 60 మ్యాచ్లు మాత్రమే ఆడా.. 100కు పైగా మ్యాచ్లు డగౌట్ నుంచి చూశా.. సంజూశాంసన్ భావోద్వేగం..
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ (Sanju Samson) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు
T20 World Cup 2026 Sanju Samson comments after Player of the Match received against west indies
- భారత గెలుపులో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్
- నా జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని అనుకోలేదు
- నా కెరీర్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్లో అడుగుపెట్టింది. ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు గెలుపులో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఆ దేవుడి దయతోనే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ (40; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం సంజూ శాంసన్ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ (27; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (17)లు పర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అకేల్ హోసిన్ ఓ వికెట్ సాధించాడు.
వాళ్లను చూసే నేర్చుకున్నా..
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ, రోహిత్, ధోని వంటి దిగ్గజాలను చూసే ఇలా ఆడటం నేర్చుకున్నానని అన్నాడు.
‘నిజం చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్ నాకు ప్రపంచకప్తో సమానం. నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టినప్పటి నుంచి దేశం కోసం ఆడాలని కలలు కన్నా. ఇన్నాళ్లు ఇలాంటి ఇన్నింగ్స్ కోసం వేచి చూశాను. అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కు ధన్యవాదాలు.’ అని శాంసన్ అన్నాడు.
AUS-W vs IND-W : వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. మూడో వన్డేలో భారత్ పై ఘన విజయం..
ఇక తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను సాధించగలనా అన్న సందేహం తనకు చాలా సార్లు వచ్చిందన్నాడు. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగినట్లు వివరించాడు. ఈ రోజు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేశాడు.
‘చాలా కాలంగా నేను ఈ ఫార్మాట్లో ఆడుతున్నాను. గత 10 నుంచి 12 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాను. గత 10 ఏళ్లుగా దేశంలో కోసం ఆడుతున్నాను. అయితే.. ఇప్పటి వరకు దేశం కోసం 50 లేదా 60 మ్యాచ్ల్లో ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. దాదాపు 100కు పైగా మ్యాచ్లను డగౌట్ నుంచి చూశాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఆడే విధానాన్ని చాలా దగ్గర నుంచి చూశాను. పరిస్థితులకు తగ్గట్లుగా వారు తమ ఆటను ఎలా మార్చుకుంటున్నారో గమనించాను. గత మ్యాచ్లో మేం మొదట బ్యాటింగ్ చేయడంతో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యం ఇచ్చాను. అయితే.. ఈ మ్యాచ్లో పరిస్థితులు పూర్తి భిన్నం.’ అని సంజూ అన్నాడు.
వికెట్లు పడుతుండడంతో భాగస్వామ్యం నిర్మించాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ఇందుకోసం తానేమీ ప్రత్యేకంగా చేయలేదన్నాడు. కేవలం బంతి పై మాత్రమే దృష్టిపెట్టినట్లు తెలిపాడు. తన జీవితంలో ఇలాంటి ఓ గొప్ప రోజు వస్తుందని అనుకోలేదన్నాడు. ఇక అభిమానులు, సహచరుల నుంచి వచ్చిన మద్దతు మరువలేనిది అని సంజూ శాంసన్ తెలిపాడు.
