Team India : టీ20 ప్రపంచకప్ పూర్తైనా.. టీమ్ఇండియాను వదలని వరణుడు.. ఎప్పుడొస్తారో..?
ప్రపంచకప్ గెలిచి మంచి జోష్లో ఉన్న టీమ్ఇండియా ప్లేయర్లకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.
![Team India : టీ20 ప్రపంచకప్ పూర్తైనా.. టీమ్ఇండియాను వదలని వరణుడు.. ఎప్పుడొస్తారో..? Team India : టీ20 ప్రపంచకప్ పూర్తైనా.. టీమ్ఇండియాను వదలని వరణుడు.. ఎప్పుడొస్తారో..?](https://10tv.in/wp-content/uploads/2024/07/Team-India-Stuck-in-Barbados-Due-To-Storm-Beryl.jpg)
Team India Stuck in Barbados Due To Storm Beryl
17 ఏళ్ల తరువాత భారత జట్టు టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది. దీంతో యావత్ భారత దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. కాగా.. ఈ టీ20 ప్రపంచకప్కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇక రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు రాక కోసం స్వదేశంలో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్లేయర్లు మనదేశంలో ల్యాండ్ కాగానే భారీ స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే.. ప్రపంచకప్ గెలిచి మంచి జోష్లో ఉన్న టీమ్ఇండియా ప్లేయర్లకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. భారత ఆటగాళ్లలంతా బార్బడోస్లోనే చిక్కుకుపోయారు.
అట్లాంటిక్లో ఉద్భవించిన ‘బెరిల్’ తుఫాన్ కారణంగా బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. మళ్లీ వాతావరణం అనుకూలించే వరకు విమానాశ్రయం మూసే ఉండనుంది. ఈ కారణంగా భారత ప్లేయర్లు, సహాయక సిబ్బంది అందరూ బార్బడోస్లోనే ఉండిపోయారు. వాస్తవానికి టీమ్ఇండియా నేడు స్వదేశానికి బయలుదేరాల్సి ఉంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు బార్బడోస్లోని హిల్టన్లో బస చేస్తున్నారు. వాతావరణం బాగుపడితే గానీ వారు స్వదేశానికి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే.. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో భారత ఆటగాళ్లపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. టీమ్ఇండియా బృందానికి రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.