ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్.. బద్దలు అయ్యే 5 భారీ రికార్డులు ఇవే.. !
మాంచెస్టర్ మ్యాచ్లో ఓ ఐదు భారీ రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది.

These 5 records may be broke in ENG vs IND 4th test
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నేటి (బుధవారం జూలై 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో భారత్ మాంచెస్టర్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. కాగా.. ఈ మ్యాచ్లో ఓ ఐదు భారీ రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది.
జోరూట్..
జోరూట్ భారత్ పై ఇప్పటి వరకు 11 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా పై టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మాంచెస్టర్లో రూట్ సెంచరీ చేస్తే.. భారత్ పై టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
కేఎల్ రాహుల్..
ఇంగ్లాండ్ గడ్డ పై ఇప్పటి వరకు ముగ్గురు భారత ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ ఈ జాబితాలో చేరేందుకు 11 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో రాహుల్ 11 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గడ్డ పై వెయ్యి పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్గా, మొత్తంగా నాలుగో టీమ్ఇండియా ప్లేయర్గా నిలుస్తాడు.
WCL 2025 : 41 ఏజ్లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
రిషబ్ పంత్..
ఈ మ్యాచ్లో పంత్ 101 పరుగులు చేస్తే.. 61 ఏళ్ల ఓ రికార్డు బ్రేక్ కానుంది. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా పంత్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కుందరన్ పేరిట ఉంది. అతడు 1963-64 లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 525 పరుగులు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో పంత్ 425 పరుగులు చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా..
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు బుమ్రా 4 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. మాంచెస్టర్లో ఓ ఇన్నింగ్స్లో బుమ్రా గనుక 5 వికెట్ల ప్రదర్శన చేస్తే.. ఇంగ్లాండ్ గడ్డ పై అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన జాబితాలో ముత్తయ్య మురళీధరన్తో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు.
టీమ్ఇండియా..
మాంచెస్టర్లో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క సారి కూడా గెలవలేదు. ఇక్కడ భారత జట్టు 9 మ్యాచ్లు ఆడింది. నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరో 5 మ్యాచ్లను డ్రా చేసుకుంది. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. మాంచెస్టర్లో భారత్కు తొలి విజయం కానుంది.