Deepfake Ad Alert : భారత్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ‘డీప్ఫేక్‘ అలర్ట్.. ఎడిట్ చేశారో లేదో ముందే చెప్పేస్తుంది!
Deepfake Ad Alert : భారతీయ యూజర్ల కోసం సోషల్ మీడియా దిగ్గజం మెటా సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ ప్రకటనలపై యూజర్లకు అవగాహన కల్పించనుంది.
Deepfake Ad Alert : ఏఐ టెక్నాలజీ పుణ్యామని.. డీప్ఫేక్.. దేశంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినీనటుల నుంచి రాజకీయ ప్రముఖల వరకు లక్ష్యంగా డీప్ఫేక్ క్రియేట్ చేయడం ఆందోళనకు దారితీసింది. సినీతారలు కత్రినా కైఫ్ రష్మిక మందన్న, డీప్ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత భారత్లో దీనిపై చర్చ మొదలైంది. ఇలాంటి కంటెంట్కు చెక్ పెట్టేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా భారతీయ యూజర్ల కోసం కొత్త పాలసీ తీసుకొచ్చింది. డీప్ఫేక్ల ద్వారా క్రియేట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఎదుర్కోవడానికి మెటా ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి, రాజకీయ, సామాజిక సమస్యలపై డిజిటల్గా క్రియేట్ చేసినా లేదా ఎడిట్ చేసిన పోస్ట్ యాడ్స్ లక్ష్యంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
భారత్ సహా ఇతర దేశాల్లోనూ ఇదే ఆందోళన :
ఈ సమస్య కేవలం భారతీయ సినీ తారలకు మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయ, సామాజిక సమస్యలకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా భారత్, అమెరికా, యూకే వంటి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. 2024లో సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమస్యలు, ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధించిన యాడ్స్లో వాస్తవికమైన ఫొటో లేదా వీడియో లేదా ప్రామాణికమైన సౌండ్ కలిగి ఉంటే.. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రకటనదారులు దాన్ని బహిర్గతం చేసేలా కొత్త విధానాన్ని మెటా తీసుకొచ్చింది. తద్వారా డిజిటల్గా రూపొందించిన లేదా ఎడిట్ చేసిన ఆడియోను డీప్ఫేక్ అని యూజర్లు గుర్తించే అవకాశం ఉంటుంది.
డీప్ఫేక్ కంటెంట్ అనేది వీడియోలు లేదా ఫొటోల వంటి మీడియాను సూచిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యక్తి ముఖచిత్రాన్ని నమ్మదగిన విధంగా క్రియేట్ చేస్తారు. డీప్ఫేక్ అనేది ఎడిట్ చేసిన లేదా ఫోటోషాప్ చేసిన వీడియో లేదా ఇమేజ్తో సమానం కాదు. ఈ టెక్నాలజీ వాస్తవికంగా కనిపించే కంటెంట్ను రూపొందించడానికి అనుమతిస్తుంది.
డీప్ ఫేక్ కంటెంట్ ప్రభావంపై అవగాహన తప్పనిసరి :
వ్యక్తులు తాము ఎప్పుడూ చేయని పనులను చెబుతున్నట్లు లేదా చేస్తున్నట్లు అనిపించేలా చేస్తుంది. డీప్ఫేక్లను వినోదం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. కానీ, అవి కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే.. డీప్ పేక్ కంటెంట్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి లేదా నకిలీ దృశ్యాలను సృష్టించడానికి వాడతారు. ఆన్లైన్ దృశ్య, ఆడియో కంటెంట్ ప్రామాణికతపై ఈ టెక్నాలజీ ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
పాలసీని ఉల్లంఘిస్తే.. జరిమానా తప్పదు :
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి మెటా కొత్త విధానం ప్రకారం.. ఏదైనా ప్రకటనను డిజిటల్గా మార్చినప్పుడు లేదా ఎడిట్ చేసినప్పుడు దాని గురించి వినియోగదారులకు తెలియజేస్తుంది. అంటే.. మీకు కనిపించే యాడ్లోనే మరో యాడ్ కనిపిస్తుంది. ఒకవేళ.. అడ్వటైజర్ ఆయా కంటెంట్ తప్పనిసరిగా బహిర్గతం చేయడంలో విఫలమైనట్టు మెటా గుర్తిస్తే.. ఆ యాడ్ రద్దు చేస్తుంది. అంతేకాదు.. అదే తప్పు తరచుగా ఉల్లంఘిస్తే.. ప్రకటనదారుపై జరిమానాలు విధిస్తుంది.
2024 జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి :
ఇమేజ్ క్రాపింగ్, కలర్ కరెక్షన్, ఇమేజ్ షార్పెనింగ్ లేదా మరేదైనా ఎడిటింగ్ వంటి మార్పులు చిన్నవిగా ఉంటే.. ప్రకటనకర్తలు వెల్లడించాల్సిన అవసరం లేదని మెటా పేర్కొంది. ఈ విధానం జనవరి 2024 నుంచి అమలులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకటనకర్తలకు అందరికి ఈ పాలసీ వర్తిస్తుంది. ప్రకటనకర్తలతో పాటు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో డీప్ఫేక్ వీడియోలను ఉపయోగించడం గురించి మెటా ఇప్పటికే వినియోగదారులందరికీ కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది.
గూగుల్ బాటలో మెటా :
ఆయా పాలసీల ప్రకారం.. అది డీప్ఫేక్ కంటెంట్ అని తెలిసి కూడా ఏ యూజర్ అయినా అలానే తప్పుడు సమాచారాన్ని అందజేస్తే ప్లాట్ఫారమ్ ద్వారా వారిని శిక్షించవచ్చు. ప్రస్తుత పాలసీని పొడిగించినా మెటా.. డీప్ఫేక్ కంటెంట్పై మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఇప్పుడు అధికారికంగా ప్రకటనదారులను మందలిస్తోంది. సెప్టెంబరులో, గూగుల్ ఇదే విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం.. ఏఐని ఉపయోగించి ఫొటో లేదా ఆడియో క్రియేట్ చేసినప్పుడు ప్రకటనదారులు వినియోగదారులకు తెలియజేయాలి. ఈ మార్పు 2023 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది.