Lok Sabha Elections 2024 : గూగుల్ తర్వాత ఫేస్బుక్.. లోక్సభ ఎన్నికల్లో ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్కు చెక్ పెట్టేందుకు మెటా చర్యలు!
Lok Sabha Elections 2024 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ అరికట్టేందుకు మెటా ‘ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే గూగుల్ కూడా ఈసీతో ఇదే అంశంపై డీల్ కుదుర్చుకుంది.
Lok Sabha Elections 2024 : భారత్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏఐ సంబంధిత ఫేక్ కంటెంట్ రాబోయే ఎన్నికలకు తీవ్రమైన ముప్పుగా మారింది. సోషల్ మీడియా దిగ్గజం, మెటా (Meta) భారత-నిర్దిష్ట ఎన్నికల కార్యకలాపాల కేంద్రాన్ని (ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఏఐ రూపొందించిన ఫేక్ లేదా తారుమారు చేసిన కంటెంట్ను అరికట్టడానికి తమ యాప్లలో (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్)లో పనిచేసే నిపుణులు పర్యవేక్షిస్తుంటారని తెలిపింది.
Read Also : Telangana Politics : ఆఫర్స్తో బలమైన నేతలకు గాలం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం
మెటా థర్డ్-పార్టీ ఫ్యాక్ట్-చెకర్స్ నెట్వర్క్ :
తప్పుడు సమాచారాన్ని పరిమితం చేయడం, ఓటరు జోక్యాన్ని నివారించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలకు మద్దతివ్వడానికి తమ ప్లాట్ఫారమ్లపై పారదర్శకతంగా ఉండేలా కంపెనీ ప్రయత్నాలను కొనసాగిస్తుందని మెటా తెలిపింది. జనరేషన్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నారా? లేదా అని పరిశీలిస్తుంటామని పేర్కొంది. ఏఐ కంటెంట్ గుర్తించేందుకు ఇండస్ట్రీ వాటాదారులతో కలిసి ఎన్నికల్లో మోసపూరిత ఏఐ కంటెంట్ వ్యాప్తిని ఎదుర్కొంటామని కంపెనీ తెలిపింది. అంతేకాదు.. మెటా థర్డ్-పార్టీ ఫ్యాక్ట్-చెకర్స్ నెట్వర్క్ను భారత్లో విస్తరిస్తోంది.
దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్-చెకర్స్ :
కంపెనీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 భాషలను అందించే 11 ఫ్యాక్ట్-చెకర్స్ పార్టనర్లు ఉన్నారు. 20 భారతీయ భాషలతో సహా 70 కన్నా ఎక్కువ భాషల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్లలో కంటెంట్ను రివ్యూ చేసే 15వేల మంది కంటెంట్ రివ్యూవర్లు ఉన్నారు. 2019 నుంచి స్వచ్ఛంద నీతి నియమావళి ద్వారా భారత ఎన్నికల కమిషన్తో కలిసి పనిచేస్తున్నామని మెటా తెలిపింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ను లేబుల్ చేయడంలో ఈసీకి సహకరిస్తుందని పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన సమయంలో భారత ఎన్నికల సంఘం కూడా ఫేక్ వార్తల సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈసీతో గూగుల్ డీల్ :
మరోవైపు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటింగ్ ప్రక్రియలపై అధికారిక సమాచారాన్ని అందించడానికి ఈసీఐతో గూగుల్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్లు టెక్-దిగ్గజం గూగుల్ గత వారమే ప్రకటించింది. గూగుల్, శక్తి (పాన్-ఇండియా నెట్వర్క్) రెండూ డీప్ఫేక్లతో సహా ఆన్లైన్ తప్పుడు సమాచారాన్ని గుర్తించడంలో సాయపడనున్నాయి. తప్పుడు సమాచారం సవాళ్లను పరిష్కరించడానికి న్యూస్ పబ్లిషర్లు ఉపయోగించే ఒక సాధారణ రిపోజిటరీని రూపొందించడానికి కలిసి పనిచేస్తాయని పేర్కొంది.