Reliance Jio Employees : రిలయన్స్ జియోను వీడుతున్న ఉద్యోగులు.. ఏడాదిలో 1.67 లక్షల మంది రాజీనామా.. అసలు కారణం ఇదే..!
Reliance Jio Employees : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2022-23లో రిటైల్, టెలికాం విభాగాల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio Employees : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2022-23లో రిటైల్, టెలికాం విభాగాల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రిలయన్స్ జియో (Reliance Jio)లో 41వేల మందికి పైగా ఉద్యోగులు, రిలయన్స్ రిటైల్లో 1 లక్ష మందికి (1,19 లక్షలు) పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. రిలయన్స్ వార్షిక నివేదికలో గణాంకాల ప్రకారం.. అంతకుముందు సంవత్సరం (FY22)తో పోలిస్తే.. అట్రిషన్ రేట్లు 64.8 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఏడాదిలోనే 1,67,391 మంది ఉద్యోగులు వైదొలిగారు.
రిటైల్ సెగ్మెంట్లో (RIL) అనేక స్టార్టప్ కంపెనీలను కొనుగోళ్లను చేసిన తర్వాత ఆపరేషన్ రిడెండెన్సీలు, రోల్స్ డూప్లికేషన్ కారణంగా ఉద్యోగుల రాజీనామాల పెరుగుదల పాక్షికంగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకే జాబ్ రోల్స్ ఎక్కువగా పెరిగాయి. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు మరో కంపెనీలోకి మారిపోయారు.
మరికొంతమంది ఉద్యోగులు (RIL) కంపెనీలో ఇతర డిపార్టమెంట్లలో కొత్త రోల్స్లో చేరిపోయారు. కంపెనీలో ఉద్యోగ నియమాకాలు పెరగడంతో చాలా మంది ఉద్యోగులు ఇతర కంపెనీల్లోకి వెళ్లిపోయేందుకు రాజీనామాలు చేశారని రిలయన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మొత్తంగా, (FY23)లో 167,391 మంది ఉద్యోగులు RIL నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో రిటైల్ విభాగం నుంచి 119,229, జియో నుంచి 41,818 మంది ఉద్యోగులు ఉన్నారు. చాలా మంది ఉద్యోగుల్లో జూనియర్ స్థాయి నుంచి మిడ్-మేనేజ్మెంట్ స్థాయిలలో ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని నివేదిక తెలిపింది. కంపెనీ సైతం ఖర్చులు తగ్గించేందుకు తమ ఉద్యోగులను స్వతహాగా వైదొలగాలని చెప్పినట్లు సమాచారం. అందులో పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులు కూడా రాజీనామా చేసినట్టు తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రిల్ వివిధ వ్యాపారాలలో 262,558 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. 2023 మేలో, RIL ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్, (JioMart) నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే ఈ తొలగింపులు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. ఎంతమంది ఉద్యోగులను తొలగించిందో ఖచ్చితమైన వివరాలు అధికారికంగా ధృవీకరించలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 46వ వార్షిక సాధారణ సమావేశాన్ని ఆగస్టు 28న మధ్యాహ్నం 2:00 గంటలకు నిర్వహించనుంది. ఈ మేరకు ఎక్స్ఛేంజీలకు కంపెనీ నోటీసు ద్వారా సూచించింది. ఈ ఈవెంట్ సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియోఫోన్ 5G, కస్టమర్-ఫోకస్డ్ జియో 5G ప్లాన్లు, మరిన్నింటితో సహా వివిధ అంశాలపై అంబానీ ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపు.. జియోఫోన్ 5G (JioPhone 5G)పై కూడా అంబానీ ఇప్పటికే ధృవీకరించగా.. డివైజ్ గురించి నిర్దిష్ట వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.