బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ.. నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష..!
ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Brs Leaders Yadadri Controversy : బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. యాదాద్రిలో నిబంధనలకు విరుద్ధంగా నేతలు పర్యటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయం ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
రుణమాఫీ విషయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిపై ఒట్టు వేసి సీఎం రేవంత్ మాట తప్పారని పాప ప్రక్షాళన పేరుతో యాదాద్రి ఆలయంలో హరీశ్ రావు చేసిన పూజ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆలయ ప్రాంగణంలోని మాడవీధుల్లో ముఖ్యంగా తూర్పు రాజగోపురం ఎదుట.. బయటి నుంచి ఒక పూజారిని తీసుకొచ్చి పాప పరిహారం పేరుతో దోష నివారణ పూజలు చేయించారు. అయితే, ఆలయ పరిసరాల్లో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.
ఆలయ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహించడం, రాజకీయాలు చేయడం ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం నిషిద్ధం అని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. దాని ప్రకారం తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు, గొంగిడి సునీత, దేశపతి శ్రీనివాస్, పూజారిపై ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం.. నేరం రుజువైతే.. గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..