అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీదే- జర్నలిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి

భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు.

అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీదే- జర్నలిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

”వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే. ఆనాడు రాజకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది.

భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం.

Also Read : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం..

తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి రూ.10 కోట్లు ఇస్తున్నా. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.