వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను గెలిపిస్తాను.. ఒక్క ఎమ్మెల్యే తక్కువ అయినా..: సీఎం రేవంత్

"రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను గెలిపిస్తాను.. ఒక్క ఎమ్మెల్యే తక్కువ అయినా..: సీఎం రేవంత్

CM Revanth Reddy

Updated On : July 4, 2025 / 7:34 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను గెలిపిస్తానని అన్నారు. 100 మంది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే తక్కువ అయినా బాధ్యత తనదేనని తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్రానికి 15 మంది ఎంపీలను ఇస్తానని చెప్పారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150కి పెరగబోతోంది. మహిళా రిజర్వేషన్ రాబోతోంది. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ టికెట్ మీ ఇంటికే వస్తుంది. రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని అన్నారు.

“తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం. ఇక్కడే ప్రజా పాలనకు నాంది పలికాం. ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని, సంక్షేమ పథకాలు అమలు చేయదని, కలిసి ఉండరని చాలా మంది ప్రచారం చేశారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాం. తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దాం.

కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తేల్చాం. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. 18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులని చేశాం. వరి వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది… కానీ వరి వేయండి సన్న వడ్లకు బోనస్ ఇస్తామని మేం చెప్పాం.

దేశంలోనే అత్యధిక వరి పండించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాం. ఒంటె పెదవుల కోసం నక్క ఎదురు చూసినట్లు రైతు భరోసా వేయొద్దని గోతికాడి నక్కలా ఎదురు చూశారు. కానీ 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. ఈ వేదికగా సవాల్ విసురుతున్నా… మోదీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆర్ వస్తారో రండి.

రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం రండి. పేదలకు రూ.5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే.. కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారు. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం. మహిళా సంఘాలు పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాం.

ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ వేదికగా మహిళలకు పిలుపునిస్తున్నా… స్వయం సహాయక సంఘాలలో చేరండి… ఆర్థికంగా నిలబడండి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.