Cm Revanth Reddy : ఆ పార్టీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే, కారు వాపస్ రాదు- సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు.

Cm Revanth Reddy : ఆ పార్టీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే, కారు వాపస్ రాదు- సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా మరోసారి చెలరేగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలతో ప్రధాని మోదీ, కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం అని, కారు కార్ఖానాకు పోయింది ఇక అది వాపస్ రాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని సెటైర్ వేశారు. 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి నిదర్శనం అన్నారు. మల్కాజ్ గిరి లో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.

మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కొత్తవాడేం కాదు. కేసీఆర్ హయాంలో మంత్రిగా పని చేసిన వాడే. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దుర్మార్గాలకు ఈటల కారణం కాదా? పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటలను బయటకు పంపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారు. అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. మల్కాజ్ గిరి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోని ఈటల ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు. మతం ముసుగులో ఓట్లు అడగడం కాదు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. అలాంటివారే నిజమైన హిందువు. ఈటల చుట్టం లాంటి వారు.. వచ్చి పోవడం తప్ప చేసేదేం లేదు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే.

ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కు అప్పగిస్తున్నారు. రైల్వే, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆలోచించాలి. మోదీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి. సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి. సునీతక్కను గెలిపించండి. మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. తెలంగాణను నిండా ముంచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది. మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాని బీజేపీ నాయకులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Also Read : రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు