CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు.. కారణం ఇదే..! షాకిచ్చిన కేంద్రం
CM Revanth Reddy : ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23న అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, కేంద్ర విదేశాంగమంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవటంతో అమెరికా పర్యటనకు వెళ్లకుండానే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు.
CM Revanth Reddy
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. ఈనెల 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు టూర్ షెడ్యూల్ కూడా రెడీ అయింది. కానీ, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించడంతో లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగిరానున్నారు.
రెండు రోజుల క్రితం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా లండన్ పర్యటనకు వెళ్లారు.. శుక్రవారం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఆయన సందర్శించనున్నారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం అవుతారు. ఆ తరువాత లండన్లో పలు కార్యక్రమాల్లో పాల్గోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 23వ తేదీన లండన్ పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకొని ఈ నెల 23న లండన్ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రానున్నారు.
కేంద్రం నిర్ణయానికి కారణం ఇదే..
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23న అమెరికాలో పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లండన్, అమెరికా పర్యటనల కోసం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం కేవలం లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
