Hyderabad Sewage samples: మురుగునీటి కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించదు

  • Published By: sreehari ,Published On : August 20, 2020 / 07:29 PM IST
Hyderabad Sewage samples: మురుగునీటి కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించదు

Updated On : August 20, 2020 / 8:00 PM IST

హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సంస్థలు సైతం ఇదే విషయంలో హెచ్చరిస్తున్నాయి.

నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని సంస్థలు వెల్లడించాయి. మురుగునీటిపై జరిపిన సంయుక్త పరిశోధనల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఇంచుమించు సమానంగా ఉండొచ్చునని వెల్లడించారు.

మురుగునీటి నమూనాలను పరీక్షించడం ద్వారా అంటువ్యాధుల తీవ్రతను గుర్తించే విధానం ఉంది. సాధారణంగా కరోనా సోకినవారి ముక్కు నుంచి కారే శ్లేష్మాలు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్ సోకుతుందని గుర్తించారు.

వైరస్ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు మురుగునీటి పరీక్షల అంశంపై హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు పరిశోధనలు చేశాయి. నగరవ్యాప్తంగా ప్రతిరోజు 1800 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తోంది.. 760 మిలియన్ లీటర్లనే (40 శాతం) మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో(STP)శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 వరకు శాంపిల్స్ సేకరించి సీసీఎంబీలో పరిశీలించారు.

ఇళ్ల నుంచి వచ్చే మురికి నీటితో :
కరోనా సోకి తగ్గినా సరే బాధితుల మలమూత్రాల్లో దాదాపు 35 రోజుల వరకు వైరస్ ఉంటుందని తేల్చేశారు. లక్షణాలు ఉన్నవారితో పాటు లేనివారి విసర్జంచేవారిలోనూ వైరస్ ఉంటోంది. ప్రతి ఇంట్లోంచి ఎంత మురుగు వస్తోందనే గణాంకాల ఆధారంగా ఎంతమందికి కరోనా వచ్చి తగ్గి ఉంటుందనే అంచనా వేశారు.

నగరంలోని 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. శుద్ధి చేయని 60 శాతం మురుగును కూడా కలిపితే 6.6 లక్షల మంది వైరస్ బారిన పడి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనాకు వచ్చారు.

అంచనాల ప్రకారం 2.6 లక్షల మందికి వ్యాధి వచ్చి ఉంటుందని సీసీఎంబీ అంచనా వేస్తోంది. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం కరోనా రోగ లక్షణాలు లేనివారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదంటున్నారు.

వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడమే కాకుండా నిరోధించడానికి, సమర్థంగా చర్యలు తీసుకోవచ్చునని అంటున్నారు. మహమ్మారి విజృంభించిన సమయంలో నియంత్రణలో ఆరోగ్య వ్యవస్థలు సమర్ధంగా పనిచేస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.

ఎస్టీపీలలో శుద్ధి చేయని నీటిలో వైరస్ ఆనవాళ్లు కన్పించగా.. శుద్ధి అనంతరం వైరస్ కన్పించలేదని పరిశోధనలో పాల్గొన్న ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటమోహన్ తెలిపారు.

మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుందన్నారు. దీని ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించదన్నారు.