సరికొత్త సవాల్తో పాలిటిక్స్ను హీటెక్కిస్తున్న సీఎం రేవంత్.. కేసీఆర్ను ఇరకాటంలో పడేసేలా రేవంత్ స్కెచ్
మరీ ముఖ్యంగా సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భాష, మాట్లాడే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.

తెలంగాణలో సవాళ్ల రాజకీయం పీక్ లెవల్కు చేరుకుంది. సలహాలు, సూచనలు ఇవ్వాలంటూనే మాజీ సీఎం కేసీఆర్ను ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం, బనకచర్ల..రైతు సంక్షేమం టాపిక్ ఏదైనా సరే చర్చకు రెడీ అంటున్నారు. వీలైతే అసెంబ్లీ లేకపోతే కేసీఆర్ ఫామ్హౌజ్కు కూడా వెళ్తానంటున్నారు రేవంత్. డేట్, టైమ్ ఫిక్స్ చేస్తే తాను చర్చకు వస్తానంటున్నారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు..గులాబీ బాస్ కేసీఆర్ టార్గెట్గా ఎన్నో సవాళ్లు చేశారు. రెచ్చగొట్టే కామెంట్స్ కూడా చేశారంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయినా రేవంత్ సవాళ్లను చాలా లైట్ తీసుకుంటూ వస్తున్నారు కేసీఆర్. చర్చకు రావడం పక్కన పెడితే కనీసం స్పందించడం కూడా స్పందించట్లేదు. ప్రభుత్వం తరఫున ఎవరైనా కేసీఆర్ టార్గెట్గా, గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే..కేటీఆర్, హరీశ్ రంగంలోకి దిగి కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read: రైల్వేలో ఉద్యోగాల జాతర.. 50,000 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. ఇప్పటికే 9,000 నియామకాలు
అయితే ఇప్పటివరకు జరిగిన సవాళ్ల పర్వం ఒక ఎత్తు అయితే..చర్చ కోసం కేసీఆర్ ఫామ్హౌజ్కు వెళ్లడానికి రెడీ అని రేవంత్ ప్రకటించడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందట. ఇలా అయితే కేసీఆర్ నోరు తెరిపించాలనేది రేవంత్ టార్గెట్ అని అంటున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీలో ఎవరి గౌరవానికి భంగం కలగకుండా నిర్వహించే బాధ్యత తీసుకుంటానంటున్న సీఎం..గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలంటున్నారు.
ఎలాగైనా చేసి..తనది కేసీఆర్ స్థాయి అని చెప్పుకునేందుకు రేవంత్ ఆరాటపడుతున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అంతేకాదు కేసీఆర్పై వెకిలి మాటలు మాట్లాడి ఆనంద పడాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన అని..రేవంత్ ఎన్ని డ్రామాలు ఆడినా..ఆయనతో చర్చకు కేసీఆర్ రారు గాక..రాబోరంటోంది కారు పార్టీ. కేటీఆర్, హరీశ్ వేసిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్న రేవంత్ కేసీఆర్ను చర్చకు రావాలని సవాల్ విసరడం వింతగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. పైగా కేసీఆర్ ఫామ్హౌజ్లోనే చర్చిద్దామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ను కేసీఆర్ చాలా లైట్ తీసుకుంటున్నారా?
నిజానికి ఇప్పటివరకు రేవంత్ విసిరిన.. ఏ సవాల్కు కేసీఆర్ రియాక్ట్ కాలేదు. పైగా తన విమర్శల్లో కూడా ఎక్కడా సీఎం రేవంత్ అని కానీ.. రేవంత్ అనే పేరు కూడా తీయలేదని గుర్తు చేస్తున్నారు కారు పార్టీ లీడర్లు. రేవంత్ను కేసీఆర్ చాలా లైట్ తీసుకుంటున్నారని..కేసీఆర్కు సరిపోలే నాయకులెవ్వరూ కాంగ్రెస్లో లేరని బీఆర్ఎస్ అంటోంది. అందుకే చర్చ పెట్టాలనుకుంటే పెట్టండి. బీఆర్ఎస్ తరఫున ఎవరు రావాలనేది మీ ఆప్షన్ కాదంటోంది గులాబీ పార్టీ.
తమ వైపు నుంచి ఎవరు మాట్లాడితే సీఎంకు, కాంగ్రెస్కు వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తోంది. మీరు చర్చకు పెట్టే ఏ అంశంపై అయినా తాము డిబేట్కు రెడీ అంటోన్న బీఆర్ఎస్..మైక్ చేయొద్దని కండీషన్ పెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా, మంత్రులతో చర్చించేందుకు కేసీఆర్ వరకు అవసరం లేదు, తాము చాలని కేటీఆర్, హరీశ్ వాదిస్తున్నారు.
అయితే ఇలా ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రాకుండా ఉన్న సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితులు, స్థాయికి తగ్గట్లుగా బిహేవ్ చేయకపోవడంతో..ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి వారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే సభకు రావట్లేదని అంటోంది గులాబీ పార్టీ.
మరీ ముఖ్యంగా సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భాష, మాట్లాడే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎన్ని సవాళ్లు విసిరినా..కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. సీఎం రేవంత్తో సహా మంత్రులు లెవనెత్తుతున్న అంశాలపై రెండు, మూడు రోజుల్లో మీడియా సమావేశం పెట్టి ప్రజలకు డిటేయిల్డ్గా వివరించేందుకు సిద్దమవుతున్నారట కేసీఆర్. ఈ లెక్కన రేవంత్ లేటెస్ట్ సవాల్ను కూడా కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది.