మైనర్ బాలికపై అత్యాచారం కేసు…అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ రద్దు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ ను శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది. అపర్ణ, అనుపమాదేవి, ప్రతాప్, సునంద నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నలుగురితో కూడిన కమిటీ విచారించనున్నారు.
బాలిక ఎప్పుడు జాయిన్ అయింది? అనంతరం జరిగిన పరిణామాలేంటి? తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎవరైనా అలసత్వం ప్రదర్శించారా? వైద్యులకు వెళ్లిన సమయంలో బాలిక కండీషన్ ఏ విధంగా ఉంది? వీటన్నింటి కోణంలో పూర్తిస్థాయిలో రిపోర్టును తయారు చేస్తారు.
వీటితోపాటు నాలుగు నెలలపాటు తన బావ దగ్గర ఉన్న సమయంలో, ఆశ్రమంలో ఉన్న సమయంలో తనపై ఏదైనా భౌతిక దాడి జరిగి ఉంటుందా? వీటన్నింటిపై పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి కూడా రిపోర్టు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కమిటీ మొత్తం అన్ని కోణాల్లో వైద్య పరంగా, టెక్నికల్ పరంగా పోలీసులు ఇచ్చే ఎంక్వైరి రిపోర్టుతోపాటు కుటుంబ సభ్యులు ఇచ్చే స్టేట్ మెంట్ ఆధారంగా అన్నింటినీ పరిశీలించి ఈనెల 20వ తేదీ వరకు తుది రిపోర్టును శిశు సంక్షేమ శాఖకు సమర్పించాల్సివుంటుంది.
ఆశ్రమంలో గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఆరోపణలు ఏమైనా వచ్చాయా? ఫిర్యాదు ఇచ్చే సమయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తూ నిర్లక్ష్యం వహించారా? అనే కోణంలో కమిటీ రిపోర్టు తయారు చేస్తుంది.