Mlas Defection: ఫిరాయింపుల ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరికి స్పీకర్ మరోసారి నోటీసుల వెనుక వ్యూహం ఏంటి?

దానం, క‌డియం ఇద్దరూ రాజీనామాకు రెడీగానే ఉన్నార‌ట‌. ఇదే విష‌యాన్ని ఇద్దరు ఇన్‌సైడ్ డిస్కషన్స్‌లో స్పష్టం చేస్తున్నారు.

Mlas Defection: ఫిరాయింపుల ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరికి స్పీకర్ మరోసారి నోటీసుల వెనుక వ్యూహం ఏంటి?

Updated On : November 21, 2025 / 10:25 PM IST

Mlas Defection: ఎనిమిది మంది సేఫ్. ఇద్దరిపై వేటు. వాళ్లిద్దరు అయితే రాజీనామానో? లేక అనర్హత ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఓవైపు సుప్రీం ఆర్డర్స్‌, ఇంకోవైపు ఎమ్మెల్యేల క్రాస్‌ ఎగ్జామినేషన్.. లేటెస్ట్‌గా ఇద్దరు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు..ఇలా ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో రోజుకో అప్ డేట్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రికి స్పీకర్‌ మళ్లీ నోటీసులు ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. ఆ ఇద్దరు త్వరలో రిజైన్ చేస్తార‌న్ టాక్ వినిస్తుండగా..మళ్లీ నోటీసులు సర్వ్‌ చేయడం వెనుక ఓ రీజ‌న్ ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పది మందిలో ఎంతమంది సేఫ్? రాజీనామాకు సిద్ధంగా ఉన్నదెవరు? వేటు పడేది ఎవరిపై?

తెలంగాణలో జంపింగ్‌ ఎమ్మెల్యేల ఇష్యూ.. రింగా రింగా తిరుగుతోంది. కోర్టు టు స్పీకర్‌..స్పీకర్‌ టు ఎమ్మెల్యేస్..మధ్యలో బీఆర్ఎస్ లీగల్ ఫైట్‌..ఇలా రోజుకో టర్న్ తీసుకుంటూ సరిపోదా సస్పెన్స్ అన్నట్లుగా మారింది ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్. ఇప్పటికే స్పీకర్‌కు సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముగిసింది. మరో ఎనిమిది వారాలు గడువు ఇవ్వాలంటూ స్పీకర్ ఆఫీస్ పిటిషన్ వేసింది. అది విచారణకు వచ్చేలోపే బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ కింద స్పీకర్‌పై యాక్షన్‌ కోసం అప్పీల్ చేసింది. ఈ క్రమంలోనే ఫైన‌ల్‌గా స్పీకర్‌కు నాలుగు వారాల గ‌డువు ఇచ్చింది. దీంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది విచార‌ణను పూర్తి చేసిన స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.

ఆ ఇద్దరికి మ‌ళ్లీ నోటీసుల వెనుక కొత్త వ్యూహం..!

అఫిడ‌విట్లు స‌మ‌ర్పించిన ఎనిమిది మంది విచార‌ణ పూర్తి కావ‌డంతో తీర్పు వెలువ‌రిస్తార‌ని..మిగ‌తా ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రి రాజీనామా చేస్తార‌నే ప్రచారం పెద్దఎత్తున జ‌రిగింది. కానీ ఇంత‌లో ఆల్ ఆఫ్ స‌డెన్ కొత్త ట్విస్ట్ తెర‌పైకి వ‌చ్చింది. స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్..దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటీసులకే ఈ ఇద్దరు స్పీకర్‌కు రిప్లై ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్లకు మ‌ళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక కొత్త వ్యూహం ఉంద‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో న‌డుస్తోంది.

దానం, క‌డియం ఇద్దరూ రాజీనామాకు రెడీగానే ఉన్నార‌ట‌. ఇదే విష‌యాన్ని ఇద్దరు ఇన్‌సైడ్ డిస్కషన్స్‌లో స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ మ‌ధ్య జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త‌ర్వాత వ్యూహం మార్చార‌ట‌. దానం, క‌డియం ఇద్దరు రాజీనామా చేస్తే ఒకేసారి రెండు చోట్ల ఉప ఎన్నిక‌లు వ‌స్తే అంత ఈజీగా ఉండదని అంచనా వేస్తున్నారట. మ‌రీ ముఖ్యంగా క‌డియం శ్రీహ‌రి నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ప‌రిస్థితి అంత‌ అనుకూలంగా లేద‌ట‌. దీంతో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌ను ఉపఎన్నిక నుంచి త‌ప్పించాల‌నే నిర్ణయానికి వ‌చ్చార‌ట‌. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేయించి..కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లో దానం త‌ప్పించుకోలేరా?

దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు కాబట్టి..అనర్హత వేటు పడితే.‌‌.ఇజ్జత్ పోతుందని..రాజీనామా చేయించబోతున్నారని చెప్పారు కేటీఆర్. సాంకేతిక సాకులు చూపి..కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని డౌట్స్ వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసినందున ఎట్టి ప‌రిస్థితుల్లో దానం త‌ప్పించుకోవడానికి వీల్లేదంటున్నారు. అందుకే ఆయన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఖాయం అంటున్నారు. ఢిల్లీలో ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట. త్వరలోనే ఆయన స్పీకర్‌కు రిసిగ్నేషన్‌ లెటర్‌ సబ్‌మిట్‌ చేయబోతున్నట్లు టాక్.

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ఇప్పటికే తమ వివరణ..క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఎక్స్‌ప్లనేషన్‌ ఇచ్చిన ఎనిమిది మంది కూడా తాము పార్టీ మార‌లేద‌ని స్పష్టం చేస్తున్నారు. తాము సీఎం రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వకంగా మాత్రమే క‌లిశామ‌ని..త‌మ మెడ‌లో వేసింది దేవుడి కండువా అంటూ చెప్పుకొచ్చారు. స్పీక‌ర్‌కు ఇచ్చిన అఫిడ‌విట్లతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్, ఓర‌ల్ ఆర్గ్యుమెంట్‌లో కూడా ఇదే విష‌యాన్ని స్పష్టం చేశారు. ఇక లేటెస్ట్‌గా నోటీసులు అందుకున్న కడియం శ్రీహ‌రి కూడా ఇలాంటి వాద‌నే వినిపించే అవ‌కాశాలున్నట్లు టాక్. ఎనిమిది మంది ఎమ్మెల్యేల మాదిరిగానే క‌డియం శ్రీహ‌రి కూడా అన‌ర్హత వేటు నుంచి త‌ప్పించుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్‌కు రిప్లై ఇవ్వబోతున్నారట.

దీంతో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 9మంది సేఫ్.. దానం నాగేందర్‌పై మాత్రం వేటు పడటమో.? లేక రాజీనామా చేయడమో.? ఏదో ఒకటి పక్కా అని అంటున్నారు. అయితే అటు బీఆర్ఎస్ మాత్రం స్పీకర్ నిర్ణయం తర్వాత మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు రెడీ అవుతోంది. ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ఎవ‌రికి వారు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ప‌ద‌విని కాపాడుకోవ‌డానికి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయ‌త్నాలు ఫ‌లిస్తాయో.? వేటు వేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: రేవంత్ రెడ్డి 9300 ఎకరాల స్కాం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.. మొత్తం ఇవిగో ఆధారాలంటూ..