Bhadrachalam Temple New Design : భద్రాచలం ఆలయ నూతన డిజైన్లు విడుదల..
మాడ వీధుల విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించగా..

Bhadrachalam Temple New Design : భద్రాచలం ఆలయ నూతన డిజైన్లు విడుదల అయ్యాయి. ఈ డిజైన్లు ఆకట్టుకునేలా ఉన్నాయని భక్తులు అంటున్నారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గత బీఆర్ఎస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆనంద్సాయి కొన్ని డిజైన్లను రూపొందించారు. ఆలయ అభివృద్ధిపై ఈ కొత్త డిజైన్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మాడ వీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం రూ.60 కోట్లను మంజూరు చేసింది. మాడ వీధుల విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించగా.. 45 మందికి రూ.34 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది.
Also Read : హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు, మా దృష్టి అంతా అభివృద్ధి పైనే- సీఎం రేవంత్ రెడ్డి
సీతారాముల కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అధికారులు హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా భూసేకరణ, సర్వే వివరాల గురించి సీఎం రేవంత్ ఆరా తీశారు. నష్టపరిహారం విడుదల కావాల్సి ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి సైతం.. రెండు, మూడు రోజుల్లో భూ నిర్వాసితుల పరిహారం అందుతుందని ప్రకటించారు. మంగళవారం రూ.34 కోట్లు విడుదల చేయగా.. ఏళ్ల తరబడి స్థానికులు, భక్తులు ఎదురుచూస్తున్న భద్రగిరి అభివృద్ధికి తొలి అడుగు పడినట్లయింది. ఈ మేరకు 45 మంది నిర్వాసితులతో ఆర్డీవో సమావేశమై నిరభ్యంతర పత్రాలు స్వీకరించారు.
వీరికి బుధవారం నష్టపరిహారం చెక్కులను ఇచ్చే అవకాశముంది. శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిపించేలా సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.