Indrasena Reddy: ఆయన అధ్యక్షతనే తెలంగాణలో ఎన్నికలకు వెళ్తాం: బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బీజేపీ సీనియర్ నేత ఇంద్ర సేనారెడ్డి చింపి, తగలబెట్టారు.

Indrasena Reddy
Indrasena Reddy – BJP: బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్షుడి మార్పు ఇప్పుడు ఉండదని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత ఇంద్ర సేనారెడ్డి అన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) అధ్యక్షతనే తాము ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవగాహనలేమితో ప్రకటనలు చేయొద్దని కోరారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారే ప్రసక్తే లేదని అన్నారు.
ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, తెలంగాణ మాత్రం సీఎం కేసీఆర్ వల్ల అభివృద్ధి జరగడం లేదని అన్నారు. యూనివర్సిటీలను మూతవేసే దిశగా ఆలోచిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు కేటాయిస్తున్న నిధులు తగ్గిపోతున్నాయని తెలిపారు.
పకోడీ అమ్మినా, ఛాయ్ అమ్మినా సిగ్గు పడం
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇంద్ర సేనారెడ్డి చింపి తగలబెట్టారు. ఆ పార్టీ హామీలను అమలు చేయలేదని చెప్పారు.
2018 మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, ఇవ్వలేదని అన్నారు. హామీలు అమలుచేయని మేనిపేస్టోను ఇలాగే తగలబెట్టాలని చెప్పారు. తాము పకోడీ అమ్మినా, ఛాయ్ అమ్మినా సిగ్గు పడబోమని తెలిపారు. ఎవరికి ఏ పనిలో ప్రావీణ్యం ఉందో అందులో ఉపాధి పొందుతారని అన్నారు.