IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

IT Raids

IT Raids In Hyderabad : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డికి చెందిన బాలాపూర్ లోని నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్ పేట్ మేయర్ గా ఉన్న పారిజాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఆశించారు.

అదేవిధంగా శంషాబాద్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5గంటల నుంచి ఏకకాలంలో అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. పారిజాతం నర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సిహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. పారిజాత నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు నివాసాల్లోనూ పది నుంచి పదిహేను బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలాపూర్ లో లడ్డు వేలంలో దక్కించుకున్న వంగటే లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి గిరిధర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోకాపేట- హిడెన్ గార్డెన్ లో ఉన్న గిరిధర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అనధికారికంగా డబ్బు, నగలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

Also Read: టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు