CM KCR : మరో 20ఏళ్లు కేసీఆరే సీఎం, వాళ్లొస్తే హైదరాబాద్ను కూడా అమ్మేస్తారు
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాదని

Cm Kcr
CM KCR : హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాది అని ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీపై టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని… ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా? అని ప్రశ్నించారు. పేదల కోసం ఏం చేశారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అసైన్డ్ భూములను తీసుకున్నానని ఒప్పుకున్న ఈటల రాజేందర్ ను పార్టీలోకి ఎలా తీసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్ల మాదిరి దాడి చేస్తున్నారని అన్నారు. మన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. దళితులకు కాంగ్రెస్ వాళ్లు కూడా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం అమలవుతోందన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే భాష హుందాగా ఉండాలని గుత్తా సూచించారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చందాలు అడుగుతున్నారని… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కూడా అమ్మేస్తారని గుత్తా అన్నారు. ఇలాంటి వారు చెప్పే మాటల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మతాన్ని వాడుకుంటూ బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని గుత్తా చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని గుత్తా అన్నారు.