Mallu Bhatti Vikramarka : ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదు – మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka : కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ నిధులు మాయమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రాజెక్టులు రాలేదని, ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదన్నారు మల్లు భట్టి విక్రమార్క. ప్రాణహితకు అంబేద్కర్ పేరును తొలగించారని అన్నారు.
లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల్లో పారే నీటితోనే పంటలు పండుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. భూమి లేని నిరుపేదలకు రూ.7వేలు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఇస్తోందని తెలిపిన భట్టి విక్రమార్క.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఏమీ ఇవ్వని తెలంగాణలో రూ.5లక్షల కోట్ల అప్పు ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. పక్కనున్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం అప్పు కేవలం రూ.83వేల 125 కోట్లు మాత్రమే అన్నారు. మనం తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదని అన్నారు.