Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు.
Adilabad Lok Sabha Constituency : ఆదిలాబాద్.. అడవుల జిల్లానే కాదు.. పోరుజిల్లా కూడా ! కుమ్రం భీమ్ పోరుగడ్డ అని పేరు ఈ ప్రాంతానికి ! అడవుల జిల్లానే అయినా.. జనాలు ఇచ్చే అంతిమ నిర్ణయం.. అంతకుమించి అనిపిస్తుంటుంది ప్రతీసారి ! అంచనాలను తారుమారు చేయడంలో.. సిట్టింగ్లను ఇంటికి పంపించడంలో.. స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో.. ఇక్కడి ఓటర్ల తర్వాతే ఎవరైనా! ఓ వైపు బీఆర్ఎస్ క్లీన్స్వీప్ టార్గెట్… మరోవైపు గురి పెంచిన బీజేపీ.. ఇంకోవైపు కసి మీద కాంగ్రెస్.. ఇలాంటి పరిణామాల మధ్య ఆదిలాబాద్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరి అక్కడి పార్లమెంట్ రాజకీయం ఎలా ఉంది.. జనాలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు.. ఏ పార్టీ బలం ఏంటి.. బలహీనత ఏంటి.. బీఆర్ఎస్ సిట్టింగ్లందరికీ మళ్లీ టికెట్లు ఖాయమా లేదంటే మార్పులు చూస్తామా.. బీజేపీ పెంచుకున్న ఆశలు ఏంటి.. కాంగ్రెస్ పెట్టుకున్న అంచనాలు ఏంటి..
అక్షరక్రమంలో ముందుంటే ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే ! ఇక్కడి జనాలు ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇస్తూ ఉంటారు. మహామహులు అనుకున్న నేతలను కూడా మట్టి కరిపించిన చరిత్ర ఆదిలాబాద్ది ! అనామకులుగా రంగంలో నిలిచిన వారిని అందలమెక్కించిన ఘనత కూడా ఆదిలాబాద్ సొంతం. ఎస్టీ రిజర్వ్డ్ అయిన ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి గెలిచిన సోయం బాపూరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి నగేశ్ను ఓడించిన సోయం.. సంచలన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం అయింది. సిట్టింగ్లను మట్టికరిపిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇస్తూ… ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు ప్రతీసారి వినూత్న తీర్పు ఇస్తున్నారు. అందుకే ఇక్కడ ఎన్నికలు ప్రతీసారి ప్రత్యేకం అనిపిస్తుంటాయ్ రాజకీయపార్టీలకు !
బీజేపీ నుంచి మళ్లీ పోటీకి సోయం సిద్ధం…అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ
వచ్చే ఎన్నికల్లో ఎంపీ సోయం బాపూరావు మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండగా.. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ నగేష్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఐతే ముందుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితుల ఆధారంగా గులాబీ పార్టీ నుంచి అభ్యర్థులు మారే అవకాశం లేకపోలేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో… ఎవరినైనా బీఆర్ఎస్ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్.. ఇప్పుడు కమలం కండువా కప్పుకున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో సరైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ మొదలుపెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి.. బీఎస్పీ తరఫున బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
సిర్పూర్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమౌతున్న కోనప్ప
ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్ అసెంబ్లీతో పాటు సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోధ్, నిర్మల్, ముధోల్ సెగ్మెంట్లు ఉన్నాయ్. ఈ ఏడు అసెంబ్లీల్లోనూ కారు జోరే కొనసాగుతోంది. సిర్పూర్ అసెంబ్లీలో కోనేరు కోనప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో బీఎస్పీ నుంచి గెలిచిన కోనప్ప.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. 2018లో అద్భుతమైన మెజారిటీ విజయం సాధించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున మళ్లీ కోనప్పకే అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు.. ఈసారి బీజేపీ తరఫున పోటీకి సిద్ధం అవుతున్నారు. దీంతో మరోసారి పాతకాపుల మధ్య కొత్త పోరు సాగే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో దిగే చాన్స్ ఉంది.
READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు
మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్న జోగు రామన్న..ప్రచారం మొదలెట్టిన కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్ అసెంబ్లీ పరిధిలో మాజీ మంత్రి జోగు రామన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే బీజేపీ టికెట్ రేసులో భారీ పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున బరిలో నిలిచిన పాయల్ శంకర్ మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా.. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి కూడా.. బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి.. ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు… బండి సంజయ్, ఈటల రాజేందర్లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఐతే బీజేపీ నేతలు ఎవరికి వారు టికెట్ ఆశలతో కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుండడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. దీంతో ఆదిలాబాద్ నుంచి కమలం పార్టీ తరఫున టికెట్ ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గండ్రాత్ సుజాతతో పాటు మైనారిటీ నాయకుడు సాజిద్ ఖాన్ పోటీ పడుతున్నారు. మూడు పార్టీల నుంచి మరోసారి పాత నేతలే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.
ఆసిఫాబాద్ లో పాగాకు కాంగ్రెస్, బీజెపీ ఎత్తుకుపై ఎత్తులు
ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు.. ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీపై 171 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఐతే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇటు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అటు మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మిలో ఎవరిని టిక్కెట్ వరుస్తుందోననే ఆసక్తి కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు కరవైన పరిస్థితి. కాంగ్రెస్ నుంచి గణేశ్ రాథోడ్, సరస్వతి పేర్లు వినిపిస్తుండగా.. బీజేపీ నుంచి విజయ్, ఆత్మారామ్ నాయక్ టికెట్ రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కని వారిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది.
READ ALSO :Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !
ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ లో కాంగ్రెస్ నుండి గట్టిపోటీ తప్పదా..
నిర్మల్ అసెంబ్లీలో దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఇంద్రకరణ్ రెడ్డి.. 9వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున మళ్లీ ఆయనే పోటీలో దిగబోతుండగా.. కాంగ్రెస్ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డికి టికెట్ ఖాయం. దీంతో ఇద్దరి మధ్య మరోసారి టగ్ ఆఫ్ వార్ నడవడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్మల్లో బీజేపీ స్ట్రాంగ్గానే ఉన్నా.. ఇంద్రకరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి ధీటైన అభ్యర్థి మాత్రం ఆ పార్టీకి కరవయ్యారు. డాక్టర్ మల్లిఖార్జున్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పల గణేశ్ చక్రవర్తిలో ఒకరిని బీజేపీ బరిలో దింపే అవకాశం ఉంది.
READ ALSO : Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?
ఖానాపూర్ లో హ్యాట్రిక్ దిశగా రేఖానాయక్
ఖానాపూర్ అసెంబ్లీలో రేఖా నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన రేఖానాయక్.. హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని పట్టుదల మీద కనిపిస్తున్నారు. ఐతే పరిస్థితులు రేఖానాయక్కు అంతగా సానుకూలంగా కనిపించడం లేదు. రిటైర్డ్ ఐఎఎస్ శర్మన్ నాయక్ కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారుపార్టీకి చెందిన కీలక రాజ్యసభ సభ్యుడి పీఏ కూడా.. ఖానాపూర్పై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాథోడ్ రమేష్… ఈసారి కమలం పార్టీ పోటీకి సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి భరత్ చౌహన్, వెడ్మా బొజ్జు టికెట్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్.
బోథ్ అసెంబ్లీ వైపు సోయం బాపూరావు చూపు
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు.
ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సోయం మళ్లీ బోథ్లో బీజేపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాతనేతల మధ్య కొత్త యుద్ధం కనిపించడం ఖాయం అనిపిస్తోంది. మాజీ ఎంపీ నగేష్ కూడా… ఆదిలాబాద్ ఎంపీ లేదా బోథ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. రెండు చోట్ల టికెట్ దక్కపోతే.. నగేశ్ తనదారి తాను చూసుకునే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ నుంచి గజేందర్, నరేశ్, అశోక్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తుండగా.. ప్రధాన పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలను ఎన్నికల సమయానికి అక్కున చేర్చుకొని టికెట్ ఇవ్వాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ముధోల్ లో విఠల్ రెడ్డికి బీజెపీ అభ్యర్ధి గట్టిపోటీ ఇస్తుందా…
ముధోల్ నియోజకవర్గంలో విఠల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన.. ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమాదేవిపై విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున మళ్లీ విఠల్ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న నియోజవర్గాల్లో ముధోల్ ఒకటి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రమాదేవి మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయ్. క్షేత్రస్థాయిలో బీజేపీ స్ట్రాంగ్గా కనిపిస్తుండడం, రమాదేవి కూడా బలమైన అభ్యర్థి కావడంతో.. ఈసారి విఠల్ రెడ్డికి గట్టి పోటీ తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి వేణుగోపాలచారి కూడా.. బీఆర్ఎస్ తరఫున బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. ముధోల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఆనంద్రావు పటేల్తో పాటు ఎంఏ లతీఫ్ హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో ముధోల్ ఒకటి. ఐతే ఒకప్పుడు తమ కంచుకోట అయిన ముధోల్ను మళ్లీ చేజిక్కించుకునేందుకు హస్తం పార్టీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీంతో అసెంబ్లీ ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు
ఆదిలాబాద్ పొలిటికల్ ఫైట్ మలుపు తిరగబోతోందా?
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజవర్గాల్లో ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ కాగా.. మిగిలినవి జనరల్. ఐతే ఆదిలాబాద్ ఎంపీ స్థానం తప్ప.. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ గులాబీ జోరు కొనసాగుతోంది. ఈసారి ఎంపీతో పాటు అసెంబ్లీలను క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ టార్గెట్గా పెట్టుకుంటుంటే.. బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అంటోంది. ఆదిలాబాద్ మీద కమలం పార్టీ ప్రత్యేకంగా నజర్ పెడుతోంది. అమిత్ షా ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై దృష్టిసారించారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. ఆ జోష్ను పార్లమెంట్ ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని కమలంపార్టీ పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట కాగా.. పూర్వవైభవం కోసం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. హస్తం పార్టీ. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ్.