Harish Rao Thanneeru : దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం- మంత్రి హరీశ్ రావు
Harish Rao Thanneeru : సిద్దిపేట అంటేనే స్వచ్చత. స్వచ్చత అంటేనే సిద్దిపేటగా పేరు తెచ్చుకున్నాము అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
![Harish Rao Thanneeru : దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం- మంత్రి హరీశ్ రావు Harish Rao Thanneeru : దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం- మంత్రి హరీశ్ రావు](https://10tv.in/wp-content/uploads/2023/06/Harish-Rao-Thanneeru.jpg)
Harish Rao Thanneeru (Photo : Google)
Harish Rao Thanneeru – Siddipet : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ దేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ నెంబర్ వన్ గా నిలిచిందని ఎంపీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను చూశామన్న ప్రభాకర్ రెడ్డి.. గత పాలనకు, నేటి పాలనకు ఎంత తేడా ఉందో కళ్ల ముందు కనిపిస్తోందన్నారు.
దేశమంతా తెలంగాణ పనితీరును గమనిస్తోందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమ రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైందన్నారు. ఇదే అభివృద్ధి కావాలంటే మూడోసారి బీఆర్ఎస్ కు ఘన విజయం అందించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
సిద్దిపేట అంటేనే స్వచ్చత. స్వచ్చత అంటేనే సిద్దిపేటగా పేరు తెచ్చుకున్నాము అని మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వచ్చతలో సిద్దిపేట.. ప్రగతికి అభివృద్ధి పేటగా మారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.6,800 జీతం ఇచ్చేవారు.. ఇప్పుడు 15,800కు పెంచుకున్నామని తెలిపారు. నాడు కనీస వేతనం ఇచ్చే వారు కాదన్న మంత్రి హరీశ్ రావు.. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ రెండున్నర రేట్లు జీతం పెంచారని చెప్పారు. నాటి పాలకులకు సఫాయి కార్మికులంటే చిన్నచూపు అన్నారు. పందులను నిర్మూలించడంతో సిద్దిపేట స్వచ్ఛతకు మొదటి బాటలు పడ్డాయన్నారు.
”ఒక్క పార్కు లేని సిద్దిపేటలో ఎన్నో పార్కులు చేసుకున్నాం. కోమటి చెరువు కోటి అందాలతో వెలుగొందుతున్నది. ఒకప్పుడు మున్సిపాలిటీలు అంటే మొర్లు, పందులు, కుక్కలు, చెత్త కుప్పలుగా ఉండేవి. గత పాలకులకు ప్రజల సంక్షేమంపై శ్రద్ధ లేకపోయేది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, చక్కటి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకున్నాం.
ఇదివరకు సర్కారు దవాఖానాకు వెళ్తే ముక్కుపుటాల అదిరిపోయేవి. ఒక్కటి కాదు రెండు కాదు స్వచ్ఛతలో, హరితహారంలో సిద్దిపేటకు 22 అవార్డులు వచ్చాయి. సిద్దిపేట పేరు లేకుండా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి కానీ అవార్డులు ఉండవు. చెత్త దైవత్వంతో సమానమన్న మహాత్ముడి మాటను నిజం చేసింది సిద్దిపేట. సమాజానికి చెత్త సేకరణలో గొప్ప సంస్కారం చూపారు సిద్దిపేట ప్రజలు.
విద్యా నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. ఆరోగ్య నిలయంగా మార్చుకోబోతున్నాం. 6 నెలల తరువాత రంగనాయకసాగర్ చూస్తే దేశం అబ్బుర పడబోతున్నది. దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం. సిద్దిపేట స్వచ్ఛబడి రాష్ట్రానికి స్ఫూర్తిగా మారింది” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.