హైదరాబాద్ లో ఉచిత మంచినీటి పథకం ప్రారంభం.. డిసెంబర్ నుంచే నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు

Minister KTR launches free fresh water scheme in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత మంచినీటి పథకం అమలైంది. బోరబండలోని రెహమత్నగర్లో ఉచిత మంచినీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇటీవల GHMC ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. నగరవాసులకు నెలకు 20వేల లీటర్ల నీటిని అందించనున్నారు. ఈ పథకంతో సుమారు 97శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా.. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ఈ పథకం ఎంతో మేలు జగరనుంది.
ప్రభుత్వం ప్రకటించినట్లుగానే జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. డిసెంబర్ నెలలో 20వేల లీటర్ల నీటిని వాడుకున్న వాళ్లు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే నల్లా కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారికే ఈ పథకం వర్తించనుంది. అలాగే స్లమ్ ఏరియాలో వారికి మీటర్లు లేకున్నా పథకాన్ని అమలు చేయనున్నరు. ఇప్పటివరకు ఉచిత మంచినీటి సౌకర్యం ఢిల్లీలో అమలవుతుండగా.. ఆ తరువాత హైదరాబాద్కే ఆ రికార్డు దక్కింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బోరబండలో గతంలో నీటి కటకట ఉండేదని అన్నారు. ఇప్పుడు 9 లక్షల కుటుంబాలకు ఫ్రీ వాటర్ ఇస్తున్నామని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉచితనీరు ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నెల నుంచి నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నగరవాసులకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరోనా విపత్తు సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ప్రభుత్వం వచ్చిన ఆరున్నరేళ్లలో దేని రేట్లు పెంచలేదని చెప్పారు. నెలకు 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. బస్తీల్లో ఉచితంగా మంచి నీరు ఇస్తున్నామని తెలిపారు.