TS Ministers: ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రులు
ఐఐటీ, జేఇఇ, నీట్ 2022 ఫలితాల్లో విజేతలుగా నిలిచిన గురుకుల విద్యార్థులను మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు అభినందించారు.

Minister Harish Rao
TS Ministers: ఐఐటీ, జేఇఇ, నీట్ 2022 ఫలితాల్లో విజేతలుగా నిలిచిన గురుకుల విద్యార్థులను మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు అభినందించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకుల విద్యార్థులు లక్షల ఖర్చుతో చదివే నారాయణ, చైతన్య విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడి ర్యాంకులు సాధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్ల, ప్రిన్సిపల్స్ , టీచర్ల కృషి వల్ల ఇది సాధ్యమైందని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు 42 ర్యాంకులు మాత్రమే వస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1312కు పెరిగిందని, తెలంగాణ ఏర్పాటుకు ముందు 134 గురుకుల కాలేజీలు ఉంటే నేడు 268 గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత గురుకులాలను సక్రమంగా నిర్వహించడం వల్ల అద్బుత ఫలితాలు వస్తున్నాయని అన్నారు.
Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..
మొత్తం ఐదు లక్షల మంది గురుకులాల్లో చదువుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ, నీట్, జేఈఈలో 657 మంది గురుకులాల విద్యార్ధులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్ధులను మంత్రి అభినందించారు.