జూన్ 8 నుంచి తెరుచుకోనున్న బార్లు, పబ్బులు ?

కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన బార్లు, పబ్బులు జూన్ 8 నుంచి తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 8 నుంచి అమలు చేయనున్న లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అబ్కారీ శాఖ వీటికీ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
జూన్ 8 తర్వాత ఇచ్చే సడలింపుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తో పాటు వీటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. సాధారణంగా ప్రతి బార్కు రెస్టారెంట్ సౌకర్యం ఉంటుంది. మద్యంతో పాటే ఫుడ్ సప్లై కూడా ఉంటుంది. రెస్టారెంట్లు తెరుచుకోనుండటంతో.. బార్లకు కూడా అనుమతినివ్వాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది.
రెస్టారెంట్లలో అమలు చేసే నిబంధనలనే బార్లలో పాటిస్తే పెద్దగా సమస్య ఉండదని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బార్లు, పబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే వీటికి కూడా 8 నుంచి అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడవచ్చని తెలిసింది.