కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరతాం, కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్లుంది- సీఎం రేవంత్ రెడ్డి
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.

Revanth Reddy Slams KTR And Kishan Reddy (Photo : Google)
CM Revanth Reddy : టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ కు బుద్ది రాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాదే అన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : కౌంట్డౌన్ మొదలైంది, ఆలోపు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే- రేవంత్ రెడ్డి సర్కార్కు కేటీఆర్ వార్నింగ్
”బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు” అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
”ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తా. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తాం. 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటా” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పని చేసిన మాణిక్ రావు ఠాక్రేను అభినందిస్తూ రెండవ తీర్మానం చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Also Read : తెలంగాణలో తమ తదుపరి టార్గెట్ ఏంటో చెప్పిన బండి సంజయ్